English | Telugu

పోలీసుల వార్నింగ్‌తో ఒంగోలుకు రామ్‌గోపాల్‌వర్మ!

పోలీసుల విచారణకు హాజరు కాకుండా ఏదో ఒక సాకుతో తప్పించుకుంటున్న రామ్‌గోపాల్‌వర్మ పెద్ద షాక్‌ తగిలింది. ఎన్నో వాయిదాల తర్వాత ఫిబ్రవరి 4న పోలీసుల విచారణకు వస్తానని చెప్పిన వర్మ.. తాను 7న వస్తానని మరోసారి వాయిదా వేశాడు. దీంతో పోలీసులు దాన్ని సీరియస్‌గా తీసుకొని 7న హాజరు కాకపోతే అరెస్ట్‌ తప్పదని వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో శుక్రవారం 11 గంటలకు ఒంగోలు వస్తానని పోలీసులకు సమాచారం అందించారు వర్మ. అయితే సాయంత్రం 5 గంటలకు వరకు వస్తానని మరోసారి పోలీసులకు తెలియజేశారు వర్మ.

ఆంధ్రప్రదేశ్‌ ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు, పవన్‌కళ్యాణ్‌, నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్‌లో పోస్టులు పెట్టారని, ఆ సందర్భంగా వాడిన వారి ఫోటోలను మార్ఫింగ్‌ చేశారంటూ వర్మపై మద్దిపాడులో గత ఏడాది నవంబర్‌ 10న కేసు నమోదైంది. ఆ సందర్భంగా విచారణకు హాజరు కావాల్సిందిగా వర్మకు నోటీసులు జారీ అయినా విచారణకు హాజరు కాలేదు. దీంతో నవంబర్‌ 25న అతన్ని అరెస్ట్‌ చేసేందుకు ఆయన నివాసానికి పోలీసులు వెళ్లారు. అయితే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే ఆ తర్వాత ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవడంతో కోర్టు అతనికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలన్న షరతుతోనే వర్మకు బెయిల్‌ మంజూరు చేసింది కోర్టు. కానీ, అతను దాన్ని ఖాతరు చేయలేదు. విచారణకు వాయిదా వేస్తూ ఉండడంతో పోలీసులు దాన్ని సీరియస్‌గా తీసుకొని అతనికి వార్నింగ్‌ ఇచ్చారు. ఇప్పుడు కూడా విచారణకు హాజరు కాకపోతే బెయిల్‌ రద్దుచేసి వర్మను అరెస్ట్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి శుక్రవారం సాయంత్రంలోపు ఒంగోలు వస్తానని పోలీసులకు సమాచారం అందించిన వర్మ ఈసారైనా పోలీసుల ముందు హాజరవుతారో లేదో చూడాలి.