Read more!

English | Telugu

అల్లరోడి సినిమాకి 'లవ్ టుడే' దెబ్బ!

ఒక్కోసారి స్ట్రయిట్ సినిమాల కలెక్షన్లకు డబ్బింగ్ సినిమాలు గండికొడతాయి. తాజాగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' విషయంలోనూ అదే జరిగింది. 'లవ్ టుడే' దెబ్బకు ఈ చిత్రం మొదటి రోజు కోటి రూపాయల గ్రాస్ కూడా రాబట్టలేకపోయింది.

'నాంది'తో విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి విజయాన్ని అందుకున్న అల్లరి నరేష్ తాజాగా మరో ఆసక్తికరమైన చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిన్న(నవంబర్ 25న) విడుదలైన ఈ చిత్రం పర్లేదు అనే టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.

'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' మొదటిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.48 లక్షల షేర్(రూ.90 లక్షల గ్రాస్) కలెక్ట్ చేయగా, ప్రపంచవ్యాప్తంగా రూ.51 లక్షల షేర్(రూ.95 లక్షల గ్రాస్) వసూలు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు నిన్ననే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ్ డబ్బింగ్ మూవీ 'లవ్ టుడే' మొదటి రోజు ఏకంగా రూ.1.15 కోట్ల షేర్(రూ.2.22 కోట్ల గ్రాస్) రాబట్టినట్టు సమాచారం. అంటే 'లవ్ టుడే'తో పోల్చితే అందులో సగం కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది మారేడుమిల్లి. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 'లవ్ టుడే' ఇప్పటికే తమిళ్ లో పెద్ద హిట్ అయింది. పైగా ట్రైలర్ కూడా యూత్ కి బాగా కనెక్ట్ అవ్వడంతో తెలుగులో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి అంటున్నారు. 

నరేష్ గత చిత్రం 'నాంది' కూడా ఇలాగే స్లోగా స్టార్ట్ అయ్యి పాజిటివ్ టాక్ తో హిట్ గా నిలిచింది. ఇప్పుడు మారేడుమిల్లి విషయంలోనూ అదే రిపీట్ అవుతుందేమో చూడాలి.