Read more!

English | Telugu

బాలయ్య-బోయపాటి కాంబోలో నాలుగో సినిమా 'అఖండ-2'

'సింహా', 'లెజెండ్' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ 'అఖండ'. గతేడాది చివరిలో లాక్ డౌన్ దెబ్బకి థియేటర్ల దగ్గర సందడి కరువైన సమయంలో విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షన్స్ తో బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా బాలయ్య చెప్పడం విశేషం.

గోవాలో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్ లో 'అఖండ' చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి బాలయ్య, బోయపాటితో పాటు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా 'అఖండ-2' గురించి బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "అఖండ-2 ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే కథ సిద్ధమైంది. సమయం చూసి అధికారికంగా ప్రకటిస్తాం" అని బాలయ్య అన్నారు. 'అఖండ-2' ఖచ్చితంగా ఉంటుందని తెలియడంతో నందమూరి ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న 'వీర సింహా రెడ్డి' సంక్రాంతికి విడుదల కానుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నాడు. మరోవైపు బోయపాటి కూడా రామ్ తో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ తర్వాత 'అఖండ-2' మొదలయ్యే అవకాశముంది. 'అఖండ'ని నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డే సీక్వెల్ ని కూడా నిర్మించే ఛాన్స్ ఉంది. మరోవైపు సితార ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లు కూడా బాలయ్య-బోయపాటి కాంబోలో సినిమా చేయడానికి పోటీ పడుతున్నట్టు సమాచారం.