English | Telugu

కింగ్‌ నాగార్జున 100వ సినిమా ‘లాటరీ కింగ్‌’.. మల్టీస్టారర్‌గా ఎందుకు చేస్తున్నట్టు?

1961లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన ‘వెలుగు నీడలు’ చిత్రంలో నెలల వయసులోనే తెరపై కనిపించారు అక్కినేని నాగార్జున. ఆ తర్వాత ‘సుడిగుండాలు’ చిత్రంలోనూ బాలనటుడిగా నటించారు. 1986లో ‘విక్రమ్‌’ చిత్రంతో హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఆ తర్వాత ప్రేమకథా చిత్రాలు, యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌, కామెడీ ప్రధానంగా రూపొందిన సినిమాలు చేసి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. నాగార్జున కెరీర్‌లో బ్లాక్‌బస్టర్స్‌, సూపర్‌హిట్స్‌ అనేకం ఉన్నాయి. అన్నింటినీ మించి ఈ తరం హీరోలెవరికీ సాధ్యం కాని భక్తిరసాన్ని అద్భుతంగా పోషించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీ సాయి వంటి సినిమాల్లో భక్తుడుగా, భగవంతుడుగా భిన్నమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకుల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తారు.

టాలీవుడ్‌లో కింగ్‌ అనే పేరును సార్థకం చేసుకున్నారు నాగార్జున. ఇటీవల కుబేర, కూలీ వంటి సినిమాల్లో నెగెటివ్‌ టచ్‌ ఉన్న పాత్రలు కూడా పోషించి తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఇప్పుడు తన కెరీర్‌లో మైల్‌స్టోన్‌ లాంటి 100వ సినిమాను దర్శకుడు రా.కార్తీక్‌తో చేయబోతున్నారు. విజయదశమికే ఈ చిత్రాన్ని స్టార్ట్‌ చెయ్యాలని ప్లాన్‌ చేశారు. కానీ, కొన్ని కారణాల వల్ల దాన్ని వాయిదా వేశారు. తన 100వ సినిమా ప్రత్యేకంగా ఉండాలన్నది నాగ్‌ ఆలోచన. అందుకే స్క్రిప్ట్‌ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. తన కెరీర్‌లో ఇది ఓ మెమరబుల్‌ మూవీగా నిలిచిపోవాలని భావిస్తున్నారు.

అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ సినిమా ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. మళ్ళీ అలాంటి ఓ అద్భుతమైన సినిమా చెయ్యాలన్నది నాగ్‌ ఆలోచన. నాగ్‌ 100వ సినిమాలో నాగచైతన్య, అఖిల్‌ కూడా నటిస్తారని సమాచారం. ఇక ఈ సినిమాకి టైటిల్‌ కూడా ఫిక్స్‌ చేశారట. నాగార్జునను ఫ్యాన్స్‌ అంతా కింగ్‌ అని పిలుచుకుంటారు. అందుకే అది టైటిల్‌లో వచ్చేలా ‘లాటరీ కింగ్‌’ అనే పేరును ఖరారు చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ నెలలోనే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు చేసి, రెగ్యులర్‌ షూటింగ్‌ను కూడా స్టార్ట్‌ చేస్తారని సమాచారం. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ని బట్టి ఈ సినిమాను పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. నాగార్జున కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచే ఈ చిత్రాన్ని తమ సొంత బేనర్‌లోనే భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో నాగార్జున సరసన ముగ్గురు హీరోయిన్లు నటించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటివరకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన ఈ విశేషాలను నాగార్జున అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.