English | Telugu
ఏప్రిల్ 2 నుంచి మే10 వరకు దేశానికి కాలసర్పదోషం
Updated : Mar 18, 2020
నివారణ కోసం విషజ్వరపీడ హర, అమృత పాశుపత యాగం
యోగవాశిష్టంలోని బీజాక్షరాలను సంపుటి చేసి యాగం నిర్వాహణ
విశాఖ శ్రీ శారదా పీఠం లో పీఠాధిపతులు స్వరూపా నందేంద్ర సరస్వతీ మహాస్వామి , పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఆధ్వర్యంలో విషజ్వరపీడ హరయాగం , అమృత పాశుపత యాగం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. దేశ ప్రజలు , ప్రపంచం యావత్తు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని కాంక్షిస్తూ శ్రీ శారదా పీఠం ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది . విషజ్వరపీడ హర , అమ్మత పాశుపత యాగం 11 రోజుల పాటు ఋత్వికుల ఆధ్వర్యంలో జరుగుతుంది.
యాగ ప్రారంభం సందర్భంగా పీఠం ఉత్తరాదికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ మాట్లాడుతూ ప్రస్తుతం భారత దేశ గ్రహ మైత్రేయి సరిగా లేనందున అటువంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయని అన్నారు . భారతదేశ జన్మ రాశి ధనురాశిలో గురుడు , కుజుడు , కేతువు మూడు గ్రహాల కలయిక , రెండు దున్న గ్రహాలతో గురు గ్రహ వీక్షణ వల్ల దేశంలో ఆరోగ్య పరమైన సమస్యలు సంభవిస్తాయని జ్యోతిష్య శాస్త్రంలో స్పష్టంగా ఉందన్నారు. మార్చి 23 నుంచి కుజుడు మకర రాశిలో శనితో కలిసి ఉండటం వల్ల ఇటువంటి పరిస్థితులు సంభవిస్తున్నాయని అన్నారు . ఏప్రిల్ 2 నుంచి మే 10 వరకు దేశానికి కాలసర్పదోషం ఉంది. ఈ పరిస్థితుల్లో దైవానుగ్రహ కార్యక్రమాలతో విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అన్నారు.
విషజ్వరపీడ హర , అమృత పాశుపత యాగం 11 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు . ఔదుంబర ( మేడి ) వృక్ష సమిదులు , సుగంధ ద్రవ్యాలు , వనమూలికలు , గోమయంతో చేసిన పిడకలు ఈ యాగంలో ఉపయోగిస్తున్నట్టు తెలిపారు . ఈ యాగధూళి ప్రజలకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుందని తెలిపారు . ఋగ్వేదం , అధర్వణ వేదాల్లోని ఆరోగ్య మంత్రాలు , యోగవాశిష్టంలోని బీజాక్షరాలను సంపుటి చేసి ఋత్వికులు ఈ యాగం నిర్వహిస్తారన్నారు .