English | Telugu

విపక్షంలో ఏ పార్టీ ఉన్నా వారి టార్గెట్‌ పోలీసులే!

తమ రాజకీయాలకు పోలీసులను బలిపీఠమెక్కిస్తున్న విషాదకర పరిస్థితి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నెలకొంది. ప్ర‌స్తుతం చంద్రబాబు నాయుడు కూడా జగన్ దారిలోనే నడుస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, విపక్షాలకు చెందిన అభ్యర్ధులపై పోలీసుల ప్రోత్సాహంతోనే, దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. తమకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని, కేంద్రబలగాలను పంపి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో పోలీసులు అన్‌ఫిట్. వారు భయపడుతున్నారు. అందుకే కేంద్రబలగాలతో ఎన్నికలు నిర్వహించాలని’ బాబు వ్యాఖ్యానించారు. అదేవిధంగా, బాబును పోలీసులు ఆయన నివాసం వద్దనే నిలిపివేసిన వైనంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు భద్రత తగ్గించిన వైనంపైనా ఆయన జగన్ ప్ర‌భుత్వం పై విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొందరు పోలీసులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

గతంలో ప్ర‌తిపక్షంలో ఉన్న వైసీపీ ఫిర్యాదు మేరకు, ఐపిఎస్‌లను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయగా.. ఇప్పుడు విపక్షంలో ఉన్న టీడీపీ, బీజేపీ ఫిర్యాదు మేరకు, రాష్ట్ర ఎన్నికల సంఘం ఐపిఎస్, డీస్పీ, సీఐలపై కొరడా ఝళిపించింది. అంటే విపక్షంలో ఏ పార్టీ ఉన్నా, వారికి పోలీసులే టార్గెట్. ఇప్పటివరకూ జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో విపక్షంలో ఉన్నప్పుడు పోలీసులపై నమ్మకం లేదని విమర్శించిన వారే, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పోలీసులకు కితాబు ఇవ్వడం ఏపీ రాజ‌కీయా నాయ‌కుల్లోనే క‌నిపిస్తుంది.

జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, చంద్ర‌బాబునాయుడు ఇద్దరు నేతలు.. తమకు అధికారం లేనప్పుడల్లా, పోలీసు వ్యవస్థను అప్రతిష్ఠ పాలు చేయడం పోలీసులకు మనస్తాపానికి గురిచేస్తోంది. ప్రాణాలు పణంగా పెట్టి, ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పిస్తు, కుటుంబ జీవితాలను కూడా త్యాగం చేసి, పిల్లలను కూడా పట్టించుకోకుండా రోడ్డుపైనే జీవితం గడుపుతున్న తమను.. రాజకీయ పార్టీలు ప్రజల దృష్టిలో, ముద్దాయిలుగా మార్చడాన్ని పోలీసులు భరించలే కపోతున్నారు.

రాజకీయ పార్టీలు, తమ స్వార్ధం కోసం పోలీసు వ్యవస్థపై బురద చల్లడం వల్ల.. పోలీసులు నైతిక సైర్థ్యం కోల్పోతే నష్టపోయేది, పౌర సమాజమేనని వారంటున్నారు. తాము లేకుండా, అడుగు కూడా ముందుకు వేయలేని రాజకీయ నాయకులు, వారి స్వార్థం కోసం తమనే అవమానించడం అనైతికమంటున్నారు. గతంలో చంద్రబాబు, జగన్ విపక్ష నేతలుగా ఉన్నప్పుడు నిర్వహించిన పాదయాత్రలకు.. ఎండనక, వాననక వారికి భద్రత కల్పించింది తామేనన్న విషయాన్ని మర్చిపోయి పోలీసుల్ని విమ‌ర్శించ‌డం దారుణ‌మంటున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలుగా వైఎస్. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఉన్నా, చంద్రబాబు ఉన్నా పోలీసు వ్యవస్థపై మ‌చ్చ ప‌డ‌లేదు. తమ వర్గానికి సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని దళిత, బీసీ సంఘాల నేతలు మాత్రమే అప్పట్లో విమర్శలు కురిపించేవి. జిల్లాల్లో ఉన్న కులసమీకరణ ఆధారంగా పోస్టింగులు ఇచ్చే సంప్రదాయం అప్ప‌ట్లో ఉండేది.

ఉదాహరణకు కమ్మ ఆధిపత్యం, రెడ్ల హవా ఎక్కువగా ఉండే గుంటూరు జిల్లాలో ఆ రెండు వర్గాలకు చెందిన వారు కాకుండా, ఇతర కులాలకు చెందిన అధికారులను ఎస్పీ, కలెక్టర్లుగా నియమించేవారు. డీఎస్పీ, సీఐల నియామకాలు కూడా అలాగే ఉండేవి. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఇలాంటి పద్ధతి పాటించేవి. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కులాలకే ప్రాధాన్యం మొదలయింది.

సమర్ధత, నిజాయితీ ప్రాతిపదిక కాకుండా.. కులం-విధేయతకే పట్టం కట్టే సంప్రదాయం ప్రారంభమయింది. దానితో అసలు ఎలాంటి పలుకుబడి, ప్రభావం లేని కింది స్థాయి కులాలకు చెందిన పోలీసులకు, అప్రాధాన్య పోస్టులు దక్కేవి.

టీడీపీ హయాంలో రెడ్డి, ఎస్సీ, కులాలకు చెందిన వారికి, చాలాకాలం పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచడం విమర్శలకు దారితీసింది. వారంతా వైసీపీకి మానసిక మద్దతుదారులయినందున, వారికి కీలకమైన పోస్టింగులు ఇస్తే ఆ పార్టీకి సహకరిస్తారన్న అనుమానమే, దానికి కారణమన్న విశ్లేషణ అప్పట్లో వినిపించింది. డీఎస్పీ పోస్టింగులు, ఎస్పీలలో ఎంతమంది కమ్మవర్గానికి చెందిన వారికి ఇచ్చారో ఒక జాబితాను విడుదల చేశారు.

అమ‌రావ‌తి రాజ‌ధానిగా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే పోలీసులపై న ఆరోప‌ణ‌లు పెరిగాయి. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉన్నప్పుడు కొంత మంది పోలీసులు కులం, పక్షపాత ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ విమ‌ర్శ‌లు చేశారు. ఫలానా పోస్టులో ఫలానా కులం వారిని నియమించారన్న నాటి వైసీపీ ఆరోపణలు, పోలీసులను నైతికంగా దెబ్బతీశాయి.

ప్ర‌స్తుతం జగన్ సర్కారు, కమ్మ వర్గానికి చెందిన పోలీసు అధికారులను వెయిటింగ్‌లో ఉంచి, ప్రతీకారం తీర్చుకుంది. మరికొందరికి లూప్‌లైన్ పోస్టింగులు ఇచ్చింది. ఐపిఎస్, ఐఏఎస్‌లకు ఎక్కడా పోస్టింగులు ఇవ్వకపోగా, కొందరిని సస్పెండ్ చేసింది. కాపు వర్గానికి చెందిన పోలీసుల విషయంలోనూ ఇదే విధానం అవలంబిస్తోంది. రెడ్డి, బీసీ, ఎస్సీ, ముస్లిం వర్గానికి చెందిన వారికి మంచి పోస్టింగులు ఇవ్వడం ద్వారా, వారిని మెప్పించింది. బాబు జమానాలో లూప్‌లైన్‌లో ఉన్న వారికి, ఎక్కడా లంచాలు తీసుకోకుండానే జగన్ సర్కారు ప్రాధాన్యం ఇచ్చింది. అసలు తమకు అలాంటి పోస్టింగులు వస్తాయని, సదరు అధికారులు కూడా ఊహించనంతగా, జగన్ సర్కారు వారిని అందలమెక్కించింది.

ప్ర‌తిప‌క్ష నేత నుంచి ముఖ్య‌మంత్రిగా ఎన్నికైన తర్వాత జగన్ మోహ‌న్‌రెడ్డి అనేక సందర్భాల్లో పోలీసుల పనితీరును ప్రశంసించడం విశేషం. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, పోలీసుల పనితీరును ఆయన ఆకాశానికెత్తారు. పోలీసులు నిబద్ధతతో పనిచేస్తున్నారని అభినందించారు. ఎస్పీ, డీఎస్పీ, సీఐలను బదిలీ చేయడంపై జగన్ స్వయంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.