English | Telugu
కళ్యాణం తో పాటు ఎంపి పి పదవి కూడా ఆ అమ్మాయికి బోనస్!
Updated : Mar 11, 2020
కళ్యాణం వచ్చినా కక్కు వచ్చిన ఆగదు అని సామెత. అచ్చు గుద్దినట్టు ఈ సంఘటన దానికి సరిపోతుంది. కాకపోతే.. కాస్త అటూ ఇటూగా.. ఇక్కడ కళ్యాణం తో పాటు ఆ పెళ్లికూతురు ఎం పి పి పదవికి నామినేషన్ వేసే మహత్తర అవకాశం కూడా దక్కించుకుంది. కలిసొచ్చే కాలమొస్తే, అటు పెళ్లి తో పటు, ఇటు పదవి కూడా దక్కించుకోవచ్చునని ఆ యువతి ఉదంతమే నిరూపిస్తోంది. వివాహ నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే ఓ యువతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేయాల్సి వస్తున్న సంఘటన ప్రకాశం జిల్లా కురిచేడులో చోటు చేసుకుంది. నిన్న రాత్రి శిరీష అనే యువతికి నిశ్చితార్థం అయింది. ఈ రోజు ఆమె నామినేషన్ వేయనుంది. కాబోయే భర్త కుటుంబం తరఫున ఆమె పోటీకి సిద్ధమై ఎన్నికల బరిలో నిలుస్తోంది.
ఇలా హడావిడిగా జరగడానికి కారణముంది. కురిచేడు ఎంపీపీ పదవి ఓసీ మహిళకు రిజర్వ్ అయింది. వైసీపీ తరఫున అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను దేకనకొండ గ్రామానికి చెందిన బెల్లం చంద్రశేఖర్ కు పార్టీ అప్పగించింది. దీంతో తన కుటుంబం నుంచే అభ్యర్థిని నిలపాలని ఆయన భావించారు. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. దీంతో ఆయన తన పెద్ద కుమారుడు సురేష్కు వివాహం చేయాలని నిర్ణయించుకుని, వెంకట నర్సయ్య అనే వ్యక్తి కుమార్తె శిరీషతో నిన్న రాత్రి హడావుడిగా నిశ్చితార్థం చేసుకున్నాడు. నేటితో ఎంపీటీసీ పదవులకు నామినేషన్ గడువు ముగుస్తుంది. దీంతో తనకు కాబోయే కోడలితో చంద్రశేఖర బుధవారం నామినేషన్ వేయించనున్నారు.