English | Telugu

సోనియాగాంధీ కి జ్యోతిరాదిత్య హొలీ గిఫ్ట్...

కాంగ్రెస్ కు గుడ్ బై ..... మోడీ, అమిత్ షా లతో భేటీ

మధ్యప్రదేశ్‌లో పరిణామాలు రాజకీయ సంక్షోభం దిశగా వెళ్తున్నాయి. కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత, మంగళ వారం ఉదయం ప్రధాన మంత్రి మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా లను కలిశారు. ఈ రోజు సాయంత్రం లేదా శనివారం నాడు ఆయన, బీ జె పీ లో చేరే అవకాశం ఉంది. ఆయన వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన లేఖను తమ రాష్ట్ర గవర్నర్‌కు వారు పంపారు. ఇదిలా అండగా, మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు భోపాల్‌లో మంగళవారం సమావేశమయ్యారు. మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్, సీనియర్ నేతలు వీడీ శర్మ, వినయ్ సహస్రాబుద్దే తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సాయంత్రం బీజేఎల్పీ నేతగా శివరాజ్‌సింగ్ చౌహన్‌ను ఎన్నుకోనున్నట్టు తెలుస్తోంది.

ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కుప్పకూలే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక బీజేపీ నేతలు వీరి వసతి సౌకర్యాలు పర్యవేక్షిస్తున్నట్లు ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంటోన్న రాజకీయ పరిణామాలపై బీజేపీ, కాంగ్రెస్ కీలక నేతలు చర్చోపచర్చల్లో పాల్గొంటున్నారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో ఆ పార్టీ నేతలు దిగ్విజయ్‌ సింగ్‌, జితు పట్వారీతో పాటు పలువురు సమావేశమయ్యారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కారు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2018 ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన కమల్‌నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు కూలడం తథ్యంగా కనిపిస్తోంది. గత వారం రోజుల నుంచి అక్కడ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన యువనేత జ్యోతిరాదిత్య సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం బెంగళూరు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం ఆయన ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఈ ఉదయం అమిత్ షాతో కలిసి ప్రధాని నివాసానికి సింధియా చేరుకున్నారు. మోదీతో దాదాపు అరగంట పాటు చర్చించినట్టు తెలుస్తోంది.

జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరుతారని ఇటీవల ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆయన మోదీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా పరిణామాలు చూస్తుంటే సింధియా బీజేపీలో చేరడం ఖాయమవుతోంది. అదే జరిగితే మధ్యప్రదేశ్‌లోని 15 నెలల కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుంది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకుని పార్టీ విజయపథంలో నడిపించిన సింధియాకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. అయితే, సీనియర్ నేత కమల్‌నాథ్‌ను సీఎంగా కాంగ్రెస్ అధిష్ఠానం సూచించింది. దీంతో సొంత పార్టీపై సింధియా గుర్రుగా ఉన్నారు. పలుసార్లు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. సింధియాను రాజ్యసభకు పంపాలని ఆయన వర్గం పట్టుబడుతోంది. కానీ, ఆయన స్థానంలో ప్రియాంక గాంధీని నామినేట్‌ చేయాలని పార్టీలోని మరో వర్గం డిమాండ్‌ చేస్తోంది. పార్టీ లోని అసంతృప్తులను బుజ్జగించేందుకు క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణ చేయాలని కమల్‌నాథ్‌ నిర్ణయించారు. ఇందుకోసం దాదాపు 20 మంది మంత్రులతో రాజీనామా చేయించారు. అయినా సింధియా వర్గం మొగ్గుచూపనట్లు సమాచారం. ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి బీజేపీ పావులు కదుపుతోంది.