English | Telugu

గుంటూరులో కరోనా అనుమానిత కేసులు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా వైరస్‌‌తో హై అలర్ట్ ప్ర‌క‌టించారు. తాజాగా గుంటూరులో రెండు కరోనా అనుమానిత కేసులను అధికారులు గుర్తించారు. వైరస్ లక్షణాలు ఉండడంతో వీరిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరి శాంపిల్స్ సేకరించి పుణె‌ ల్యాబ్‌కు పంపారు. వీరిలో ఒకరు నేపాల్‌ పర్యటనకు వెళ్లి రాగా.. మరొకరు వియత్నాం వెళ్లొచ్చినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. వైరస్ లక్షణాలతో పలువురు ఐసోలేషన్ వార్డుల్లో చేరుతున్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. నిఘా, నియంత్రణ, నివారణతో వైరస్‌కు అడ్డుకుట్ట వేయొచ్చంటున్నారు అధికారులు. ఇప్పటివరకు వైరస్‌ అనుమానితులుగా పరీక్షలు జరిగినవారు 70 మంది ఉన్నారని.. వారిలో కరోనా పాజిటివ్‌ ఒకరికే తేలిందని.. 57 మందికి నెగెటివ్‌గా నిర్థారణ అయ్యిందన్నారు. ఇక శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సినవి 12 ఉన్నాయన్నారు.

ఇప్పటివరకు స్క్రీనింగ్‌ నిర్వహించి.. పర్యవేక్షణలో ఉన్న బాధితుల సంఖ్య 512మంది అని తేలింది. 28 రోజుల పర్యవేక్షణ పూర్తి చేసుకున్న బాధితులు 244.. ఆస్పత్రి అబ్జర్వేషన్‌లో ఉన్నవారి సంఖ్య 21గా ఉంది. ఇటు విజయవాడలోని సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలో కోవిడ్‌-19 వ్యాధి నిర్ధారణ కేంద్రం ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా కలెక్టర్లను జిల్లా నోడల్‌ ఆఫీసర్లుగా ప్రభుత్వం ప్రకటించింది.