English | Telugu
భారీ నష్టంలో మామిడి రైతులు
Updated : Mar 17, 2020
ప్రపంవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా భయాలు పండ్లరాజును సైతం విడిచిపెట్టలేదు. కరోనా వైరస్ ప్రభావం మామిడి ఎగుమతులను తీవ్రంగా ప్రభావితం చేసింది. 40శాతం మామిడి పంటను ఎగుమతి కోసం ఉత్పత్తి చేయడంతో తాజా పండ్లను రవాణా చేసేందుకు అవకాశం లేకపోవడం రైతులను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు.
మామిడి సీజన్ ఇప్పుడే ప్రారంభం అవుతోంది. గల్ఫ్, యూరోపియన్ దేశాలు, అమెరికాలో ఈ పండ్లకు చాలా డిమాండ్ ఉంది. విదేశాలలో ఉంటున్న భారతీయులు మామిడి సీజన్ కోసం వేచి ఉన్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తితో వ్యాపారులు మామిడి పండ్లను ఎగుమతి చేయలేకపోతున్నారు. మన దేశంలో మామిడి ఉత్పత్తిలో 40శాతం విదేశాలకు పంపబడుతుంది. దీనికోసమే రైతులు మామిడి పండ్లపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఈ పండ్లకు విదేశాలలో విపరీతమైన డిరాకీ ఉంది.
ఒక వేళ ఎగుమతులు లేకపోతే మాత్రం రైతు తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. విమానంలో పంపేబదులుగా సముద్ర మార్గంద్వారా పంపేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఒకవేళ పంపినా గమ్యస్థానానికి చేరుకుంటుందనే గ్యారంటీ లేదు.
సీజన్ ఒక నెల ఆలస్యంగా ప్రారంభమైంది. మామిడి ఎగుమతులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రైతుల యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఎగుమతులు లేకపోతే సగానికి సగంపంట వృధా అయినట్లే. రైతులపై ఊహించలేనంత భారం పడుతుంది. ఈ సీజన్లో రైతులకు ప్రధాన ఆదాయం మామిడి ఎగుమతులే.