English | Telugu

కరోనా దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు!

మహమ్మారి కరోనా వైరస్ దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గడిచిన 24 గంటల్లోనే ప్ర‌పంచంలో 500 మంది ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ప్రాణాంతక వైరస్ ప్రస్తుతం 117 దేశాలకు వ్యాపించింది. ఇప్పటి వరకు 10,000 మందికిపైగా మృతిచెందగా, వైరస్ సోకినవారి సంఖ్య 2,45,600 దాటింది.

భార‌త్‌లో క‌రోనా మ‌ర‌ణాల సంఖ 5, న‌మోదైన కేసులు 206
భారత్‌లో కరోనా మరణాల సంఖ్య ఐదుకు చేరింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో కరోనా వైరస్‌తో హాస్పిటల్ చేరి చికిత్స పొందుతున్న ఇటలీ పర్యాటకుడు శుక్రవారం చనిపోయాడు. మార్చి మొదటి వారంలో భారత్‌కు వచ్చిన ఇటలీ దంపతులకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ప్రస్తుతం మృతుడి భార్య కోలుకున్నట్టు వైద్యులు తెలిపారు. దేశంలో కోవిడ్ మరణాలు నాలుగుకు చేరుకోగా, బాధితుల సంఖ్య 206 కు చేరింది. పంజాబ్‌కు చెందిన వ్యక్తి కరోనా వైరస్‌తో గురువారం చనిపోయాడు. గురువారం దేశవ్యాప్తంగా మరో 27 మందికి వైరస్ నిర్ధారణ కావడంతో దేశంలో కరోనా లక్షణాలు కనిపించినవారిలో ఇప్పటివరకు 206 పాజిటివ్ కేసులు నిర్ధరణయినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించింది.

తెలంగాణలో 16, ఏపిలో మూడు క‌రోనా కేసులు!

తెలంగాణలో మరో రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణాలో క‌రోనా కేసుల సంఖ్య 16కు చేరుకుంద‌ని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.

ఏపీలో మూడో కరోనా వైరస్ కేసు నమోదైంది. ఇటీవల ఉమ్రా యాత్ర కోసం వెళ్లి మక్కా నుంచి తిరిగొచ్చిన విశాఖ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆ వ్యక్తికి చెస్ట్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు ఈ నెల ఆరంభంలో ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరు యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. రెండో కేసు ప్రకాశం జిల్లాలో నమోదైంది. మార్చి 15న లండన్ నుంచి ఒంగోలు చేరుకున్న వ్యక్తికి కూడా కోవిడ్ ఉన్నట్లు తేలింది.