English | Telugu

తెలంగాణలో కరోనా 2వ స్టేజ్ 30కి చేరిన కేసులు!

తెలంగాణలో కరోనా విశృంఖలంగా విస్తరిస్తోంది. సోమ‌వారం ఒకే రోజు మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపింది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30కి చేరింద‌ని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. కరీంనగర్ లో ఒక పాజిటివ్ కేసు.. మరో రెండు హైదరాబాద్ లో నమోదైనట్టు తెలిపారు. దీంతో మొత్తం కేసులు 30కి చేరాయని బులిటెన్ లో తెలిపారు.

ఈనెల 31వరకు తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుందని.. ఎవరూ బయటకు రావద్దని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది.

సోమవారం ఫ్రాన్స్ - ఇంగ్లండ్ నుంచి వచ్చిన ఇద్దరు యువకులకు పరీక్షలు చేయగా.. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్ కు చెందిన 21 ఏళ్ల యువకుడు ఫ్రాన్స్ నుంచి వచ్చాడు. అలాగే 30 ఏళ్ల వ్యక్తి లండన్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. వీరికి వైరస్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

కరీంనగర్ లో మరో కేసు నమోదైంది. 23 ఏళ్ల కరీంనగర్ యువకుడికి వైరస్ నిర్ధారణ అయ్యింది. కరీంనగర్ లో పర్యటించిన ఇండోనేషియా బృందంతో ఇతడు కలిశాడు. వారితో కలిసి తిరిగాడు. తాజాగా చేసిన పరీక్షల్లో ఇతడికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ఒకేసారి మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తెలంగాణలో కలకలం రేగింది.