English | Telugu
తెలంగాణలో 33కు చేరిన కరోనా కేసులు!
Updated : Mar 23, 2020
ఒక్క రోజే 6 పాజిటివ్ కేసులు బయటపడడంతో కరోనా పై తెలంగాణ సర్కార్ ఆందోళనలో పడింది. మొన్నటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారిలో మాత్రమే కరోనా కనిపించగా.. ఇప్పుడు తెలంగాణ స్థానికులకూ ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మూడు కాంటాక్ట్ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పేషెంట్లకు దగ్గరగా మెలగడం వలన వారికి కరోనా సంక్రమించింది.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలుగువన్కు తెలిపారు. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33కు చేరింది. వీరిలో ఒకరు కోలుకొని డిశ్చార్జి కాగా.. మరో 32 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు. అయితే బాధితులు కోలుకుంటున్నారని అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన వెల్లడించారు.
మరో 97 మంది అనుమానితులు బ్లడ్ శాంప్లిస్ రిపోర్టులు పుణె వైరాలజీ ల్యాబ్ నుంచి రావాల్సి ఉందని ఈటల రాజేందర్ చెప్పారు. ఇప్పటివరకు వైరస్ కారణంగా మరణాలు సంభవించలేదని ఆయన పేర్కొన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే కరోనాను ఎదుర్కోవడం కష్టమేమీ కాదని చెప్పారు.