English | Telugu

అమిత్ షా చర్యలు తీసుకుంటామని చెప్పారు: సీఎం రమేశ్

అమిత్ షాను కలిసిన బీజేపీ ఎంపీలు
వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్న సీఎం రమేశ్
పోలీసులే నామినేషన్లు అడ్డుకుంటున్నారని ఆరోపణ

ఏపీలో బీజేపీ నేతలపైనా, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయంటూ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మండిపడ్డారు. ఏపీలో పరిస్థితులు అదుపులోకి రాకపోతే చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అమిత్ షా చెప్పారని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని, పోలీసులే నామినేషన్లను అడ్డుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని సీఎం రమేశ్ ఆరోపించారు. పోలీసుల వ్యవహారశైలిపై నిఘా ఉంటుందన్న విషయాన్ని పోలీసులు గ్రహించాలని హితవు పలికారు. కాగా, బీజేపీ ఎంపీలు సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, జీవీఎల్ నరసింహారావు తదితరులు ఇవాళ హోంమంత్రి అమిత్ షాను కలిసి లేఖను సమర్పించినట్టు తెలుస్తోంది.