English | Telugu
హనీమూన్ వెళ్లిన జంటకు కరోనా, విషయాన్ని దాచిపెట్టి అధికారులకు తప్పుడు సమాచారం
Updated : Mar 17, 2020
కరోనా బారినపడ్డ తన కుమార్తెను ఇంట్లో దాచిపెట్టి అధికారులను తప్పుదోవ పట్టించాడు. ఇటలీకి హనీమూన్ కు వెళ్లిన తన కుమార్తె వివరాలను దాచిపెట్టి వైద్య అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చాడు. చివరకు అల్లుడితో పాటు కుమార్తెకు కూడా కరోనా పాజిటివ్గా తేలడంతో ఆమెను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఆగ్రాలోని కంటోన్మెంట్ రైల్వే కాలనీలో నివాసం ఉండే ఓ మహిళ తన భర్తతో కలిసి ఇటీవల హనీమూన్ కోసం ఇటలీకి వెళ్లొచ్చింది. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్తకు పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. దీంతో అతడి ట్రావెల్ హిస్టరీని ట్రాక్ చేసిన కర్ణాటక వైద్యాధికారులు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. ఆగ్రాలో తల్లిదండ్రుల వద్ద ఉన్న ఆ వ్యక్తి భార్యను పరీక్షించేందుకు వైద్యుల బృందం వారి ఇంటికి వెళ్లగా.. ఆమె తండ్రి అధికారులను తప్పుదోవ పట్టించాడు. తన కుమార్తె ఇంట్లో లేదని, ఢిల్లీ నుంచి బెంగుళూరుకు వెళ్తోందని చెప్పాడు. కానీ, ఆమె ఆ ఇంట్లోనే ఉందనే విషయాన్ని అధికారులు గుర్తించారు.
వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు, అధికారులను తప్పుదోవ పట్టించింనందుకు పోలీసులు.. యువతి తండ్రిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జిల్లా మేజిస్ట్రేట్ ప్రభు ఎన్ సింగ్ ఆదేశాల మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కరోనా బారినపడ్డ సదరు యువతిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామని అదనపు ప్రధాన వైద్య అధికారి డాక్టర్ వినయ్ కుమార్ తెలిపారు.