English | Telugu
కరోనా నియంత్రణకు హాంకాంగ్ రాజీలేని పోరాటం!
Updated : Mar 22, 2020
వీలైనంత దూరం పాటించండి. శుభ్రంగా వుండండి. ఆరోగ్యపరంగా ఏమైనా అనుమానం వుంటే వెంటనే డాక్టర్ను సంప్రదించండంటూ హాంకాంగ్ ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. మన ఆరోగ్యంతో పాటు సామాజిక ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అంటు నినాదం ఇచ్చింది హాంకాంగ్ ప్రభుత్వం.
హాంకాంగ్లో పరోక్షంగా కర్ఫ్యూ అమలులో వుంది. గత రెండు నెలలుగా సామాన్య జీవనంలో పూర్తిగా స్థంభించిపోయింది. ఎప్పుడు సందడిగా కనిపించే ఈ దేశం బోసిపోయి కనిపిస్తోంది. అత్యవసర విభాగాలు తప్ప మిగతా వాటికి హాలిడే ప్రకటించి షట్డౌన్ చేశారు. ఈ పరిస్థితి మే వరకు కొనసాగనుందంటున్నారు.
విదేశాల్లో నుంచి వచ్చిన వారందరూ క్వారంటీన్ చేయాల్సిందేనని హాంకాంగ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
విమానాశ్రయంలోనే సదరు వ్యక్తి చేతి మణికట్టుకు ఎలక్ట్రానిక్ బ్రేసెలెట్ తొడిగిస్తున్నారు. అతనికి చెందిన ఫోన్లో స్టే హోం సేఫ్ అనే యాప్ను డౌన్లోడ్ చేసి ఇస్తున్నారు. ఈ యాప్ ద్వారా వారిపై నిఘా పెట్టి పరిశీలిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ క్వారంటీన్ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది అక్కడి ప్రభుత్వం.
హాంకాంగ్లో రోజు రోజుకు కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతున్నప్పట్టికీ పూర్తిగా అదుపులో వుందని హాంకాంగ్ ఆరోగ్యశాఖ ప్రకటించింది. రానున్న రెండు మూడు వారాల్లో వచ్చే విదేశీయులతో జాగ్రత్తగా వుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అంతే కాదు స్థానికులు జాగ్రత్తలు తీసుకోవలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అవసరమైతే ఇతర దేశాల నుంచి వారిపైనే ఆంక్షలు పెట్టే అంశాన్ని కూడా హాంకాంగ్ ప్రభుత్వం ఆలోచిస్తోంది.
మరో ప్రక్క ప్రజలు ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారు. విద్యార్థులు ఆన్లైన్ స్కూలింగ్ చేస్తున్నారు. టీచర్లు ప్రత్యక క్లాస్లను ఆన్లైన్లో బోధించడానికి కొత్త విద్యావిధానాన్ని అమలుచేస్తున్నారు. షాపింక్మాల్స్, సూపర్మార్కెట్లను ఎప్పట్టికప్పుడు శానిటైజ్ చేస్తూ జాగ్రత్తలు పాటిస్తున్నారు.
రోజువారీగా చిన్న ఉద్యోగాలు చేసేవారు షాపులు మూసివేయడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సామాన్య ప్రజలు ఇలాంటి వారికి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. వారికి అవసరమైన నిత్యావసర వస్తువుల్ని అందిస్తూ హాంకాంగ్ రూల్ మోడల్గా ఆదర్శంగా నిలుస్తోంది.
ఇప్పటి దాకా కరోనా వైరస్ కేవలం మనుషుల్లోనే వ్యాప్తి చెందుతుందని తెలుసు. కానీ హాంకాంగ్లో ఓ పెంపుడు కుక్కకు కరోనా సోకింది. ఇది మనిషి నుంచి జంతువుకా, లేదా జంతువు నుంచి మనిషి వచ్చిందా? దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. హాంకాంగ్ లో కోవిడ్-19 రోగి అయిన 60 ఏళ్ళ మహిళ పెంపుడు కుక్కకు కూడా ఈ వైరస్ సోకడంతో హాంకాంగ్ ప్రభుత్వం అప్రమత్తమై జంతువులపైన కూదా దృష్టి పెట్టింది.
ఆ పెంపుడు కుక్కకు టెస్టులు జరపగా 'వీక్ పాజిటివ్' లక్షణాలున్నట్టు తేలింది. దీంతో దాన్ని జంతువుల క్వారంటైన్ కు పంపించి క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో దానికి బలహీన స్థాయిలో కరోనా వైరస్ ఉందని రిపోర్ట్ వచ్చింది. ఆ తరువాత ఆ కుక్క చనిపోయింది. దీనిపైన సీరియస్గా పరిశోధనలు జరుగుతున్నాయి.