English | Telugu

ఎన్టీఆర్, హృతిక్ మధ్య యుద్ధం.. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు!

 

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'వార్2'. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా వార్ 2 గురించి చిత్ర దర్శకుడు అయాన్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇండియన్ సినిమాలో ఐకానిక్ స్టార్స్ అయిన హృతిక్, ఎన్టీఆర్ మధ్య సంఘర్షణ అనేది అందరినీ ఆకర్షించేలా కథను రూపొందించటంలో తాను ఎక్కువగా సమయాన్ని వెచ్చించినట్లు ఆయన పేర్కొన్నారు. 

 

అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ "ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఇష్టపడిన వార్ సినిమాకు కొనసాగింపుగా ఫ్రాంచైజీని రూపొందించటం, దానిపై నాదైన ముద్ర వేయాలనుకుని కష్టపడటాన్ని ఓ పెద్ద బాధ్యతగా భావిస్తాను. వార్2 ను డైరెక్ట్ చేసేటప్పుడు నా తొలి చిత్రాన్ని డైరెక్ట్ చేసినట్లే భావించాను. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీలో మన సినిమా అనేది భాగమయ్యేలా చూసుకోవాలి. లేకపోతే ఆనందం ఉండదు. ఆల్ రెడీ బ్లాక్ బస్టర్ అయిన సినిమాను ముందుకు తీసుకెళుతున్నప్పుడు దానికంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వారితో పాటు దేశంలోని ఇద్దరి సూపర్ స్టార్స్ ఫ్యాన్స్‌ను ఈ జర్నీలో భాగం చేయాలి. నిజాయతీగా చెప్పాలంటే ఓ దర్శకుడిగా ఇలాంటి భావనను కలిగించటానికి పూర్తిగా నిమగ్నమయ్యాను. ప్రేక్షకులకు ఓ సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా వార్2 చిత్రాన్ని రూపొందించాం. ఎన్టీఆర్, హృతిక్ మధ్య ఉండే సంఘర్షణ అనేది అందరికీ కనెక్ట్ అయ్యేలా కథను, అందుకు తగినట్టు యాక్షన్ సన్నివేశాలను రూపొందించాం. ఇండియన్ సినిమాలోని ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ ఒకచోటికి చేరేలా వార్2 సినిమా చేసింది. వీరిద్దరి కలయికలో సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు, ప్రేక్షకులు ఎగ్జయిటెడ్‌గా ఉంటారో, వారి అంచనాలేంటో తెలుసు. అలాంటి వారు థియేటర్స్‌కు వచ్చినప్పుడు వారికి లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్‌లా ఈ సినిమా ఉండాలనే ఆలోచించి రూపొందించాం" అన్నారు. 

 

'వార్ 2' సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్ యాక్షన్ ప్రియులను మెప్పించింది.