లక్ష్మీపూజ ఎలా చేయాలి?
లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు ఆదివారం. ఈ సంవత్సరం ఆదివారం, అమావాస్య, ఆర్ధరాత్రం, స్వాతీ నక్షత్రం అన్నీ కలిసిరావటం ప్రత్యేకత. కాబట్టి ఈ సంవత్సరం దీపావళి రోజున అర్థరాత్రి అంటే పన్నెండు గంటల తరువాత ఇంటి మధ్య భాగంలో మన తాహతును బట్టి బియ్యాన్ని రాశిగా పోసి నలుచదురంగా చేసుకుని దానిపైన తెల్లని వస్త్రాన్ని పరిచి, దానిమీద లక్ష్మీదేవి పటాన్ని వుంచి ఆవునేతి దీపాన్ని వెలిగించుకోవాలి. స్నానం చేసి తెల్లని వస్త్రాలను కట్టుకుని పూజకు ఉపక్రమించాలి. తెల్లని పూలను, తెల్లని గంధాన్ని ప్రక్కన పెట్టుకుని లక్ష్మీదేవి సహస్రనామాలు చదువుతూ ఒక్కొక్క పూవుకి గంధాన్ని అద్దుతూ లక్ష్మీదేవికి సమర్పించాలి. నైవేద్యంగా తెల్లని పాలతో చేసిన పాయసాన్ని దూపాన్ని, దీపాన్ని చూపించి లక్ష్మీదేవికి నివేదించాలి. వెలిగించిన దీపం పూజ పూర్తయ్యే వరకూ వెలుగుతూనే ఉండాలి.