బాబుదే అధికార పీఠం ఎలాగంటే..?
Publish Date:Aug 16, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. ఒక పక్కన అధికార వైసీపీ, మరో పక్కన ప్రతిపక్ష టీడీపీ, ఇంకో వైపున జనసేన, బీజేపీలు తమ తమ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంలో తలమునకలై ఉన్నాయి. మరో పక్కన పబ్లిక్ సర్వేల పేరుతో పలు సంస్థలు నివేదికలు కూడా ప్రకటిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే.. అనే ప్రాతిపదికన ఆయా సర్వేలు నిర్వహించి, ఫలితాలు ప్రకటిస్తున్నాయి. ఆయా సర్వేల నివేదికల ఫలితాల ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీట్లు తగ్గినా అధికార వైసీపీదే మళ్లీ అధికారం అని చెబుతున్నాయి. అయితే.. సుమారు ఏడాదిన్నర తర్వాత జరిగే ఎన్నికల వరకు ఇదే మూడ్ ఓటర్లలో ఉంటుందా? అంటే దానికి అవునని మాత్రం చెప్పలేకపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే సంక్షేమ పథకాల ద్వారా వైసీపీ సర్కార్ దిగువ స్థాయి, మధ్య తరగతిలోని కొన్ని వర్గాల ఓట్లను రాబట్టుకోగలుగుతుందనీ, ఉన్నత వర్గాలు, మధ్యతరగతిలోని కొన్ని వర్గాల వారు, తటస్థులు అధిక శాతం మంది పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటు వేసే పరిస్థితి అంతగా ఉండదనీ అంటున్నారు. అలాంటప్పుడు పోలింగ్ శాతం తక్కువ నమోదవుతుంది. అలా ఓటు వేసేది దిగువ, కిందిస్థాయి వర్గాల వారే అయి ఉంటారు. సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్న వారు అధికార పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అదే.. పోలింగ్ శాతం అధికంగా పెరిగితే మాత్రం అధికార వైసీపీకి చెక్ చెప్పినట్లే అనే విశ్లేషణలు వస్తున్నాయి. నిజానికి ఉన్నతస్థాయి, మధ్యతరగతి వర్గాలు, తటస్థులను పోలింగ్ బూత్ లకు గనుక రప్పించ గలిగితే ప్రతిపక్ష టీడీపీకే ప్రయోజనం కలుగుతుందంటున్నారు. పోలింగ్ శాతం పెరగడం అంటే.. అధికార పక్షంపై వ్యతిరేకత ఒకటైతే.. ఉన్నత, మధ్యతరగతి, తటస్థంగా ఉండే వర్గాల ఓట్లు పోలవడం మరో కారణం అవుతుంది. అదే జరిగితే అధికార వైసీపీకి మూడినట్లే అనే అంచనాలు వస్తున్నాయి. అదే సమయంలో టీడీపీకి విజయావకాశాలు పెరుగుతాయంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సర్వేల ప్రకారం పేదలు, గ్రామీణ ఓటర్లలో మాత్రం వైసీపీ పట్ల కొంత సానుకూలత ఉంది. ఈ కారణంతోనే ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో మళ్లీ వైసీపీకే అధికారం అనే అంచనాలు వస్తున్నాయి. సంక్షేమ పథకాలు అందుకుంటున్నవారు వైసీపీ పట్ల సంతోషంగానే ఉంటారు. అయితే.. ఏపీలో అభివృద్ధి అసలే లేదనే చర్చ ఉన్నతస్థాయి మధ్యతరగతి వర్గాల్లోని విద్యావంతుల్లో కొనసాగుతోంది. వీరితో పాటు తటస్థుల్లో కూడా ఇలాంటి చర్చే జరుగుతోంది. ఈ మూడు వర్గాల్లోనే వైసీపీ వ్యతిరేక ఓటు ఉంటుంది. అందుకే ఈ మూడు వర్గాలను ఆకట్టుకోగలిగితే.. టీడీపీకి సానుకూలత పెరుగుతుందనే అంచనాలు వస్తున్నాయి. పోలింగ్ బూత్ లకు ఉన్నత వర్గాలు రారు అనే బలమైన భావన ఉంది. మధ్యతరగతి వర్గాల్లో అధికశాతం మంది పోలింగ్ కు గైర్హాజరవుతుంటారు. తటస్థులైతే ఎవరికి ఓటు వేస్తే ఏం ప్రయోజనం అనే వేదాంత ధోరణిలో ఓటింగ్ కు దూరంగా ఉంటుంటారు. వాస్తవానికి ఈ మూడు వర్గాలు తలచుకుంటే మాత్రం ఫలితాలను తారుమారు చేయగల స్థితిలో ఉన్నాయి. ఒకవేళ వారు బయటికి వచ్చి ఓట్లు వేస్తే మాత్రం.. బలమైన మార్పు తప్పదనే భావించాలి. ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం కచ్చితంగా ఇబ్బందుల్లో పడుతుందనే భావన ఈ మూడు వర్గాల్లోనూ ఉంది. అయితే.. అది ఉద్యమ స్థాయిలో లేదనే చెప్పాలి. ఈ భావననే ఏపీ ప్రజల్లో రాజేసేందుకు టీడీపీ అహరహం కృషి చేస్తోంది. టీడీపీ ప్రయత్నాలు ఉన్నత, మధ్యతరగతి, తటస్థ వర్గాలను ఆకర్షించగలిగితే.. వైసీపీకి ప్రమాద ఘంటికలు మోగించినట్లే అంటున్నారు. చూడాలి మరి.. 2024లో ఏపీలో ఏమి జరుగుతుందో.. టీడీపీ గనుక ఆ మూడు వర్గాలను పోలింగ్ బూత్ లకు రప్పించ గలిగితే భారీ పోలింగ్ జరుగుతుంది. అదే జరిగితే అధికార మార్పిడి తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
http://www.teluguone.com/news/content/telugudesham-come-into-power-do-you-know-how-39-142051.html