తెలుగుదేశం ప్రచార గీతాల వీడియో విడుదల

ఎన్‌టిఆర్‌ భవన్‌లో సీబీఎన్‌ వారియర్స్‌,  గుమ్మడి గోపాలకృష్ణ ప్రొడ్యూస్‌ చేసిన వీడియో పాటల విడుదల కార్యక్రమం శుక్రవారం  (ఏప్రిల్ 19) జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాలుగు వీడియో పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ రాజకీయ కార్యదర్శి  టి.డి. జనార్థన్‌, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోత్స్న, నిర్మాతలు కె.ఎస్‌. రామారావు, గుమ్మడి గోపాలకృష్ణ, కొడాలి వెంకటేశ్వర్‌ రావులు అతిథులుగా పాల్గొని పాటల వీడియోను విడుదల చేశారు.  ఈ సందర్భంగా  పొలిట్‌బ్యూరో సభ్యుడు టి.డి. జనార్థన్‌ మాట్లాడుతూ...  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల దృష్ణా ఏపీలోని జగన్  ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో చేసిన అరాచకం,  ప్రజలను వేధించిన విధానాలతో , భావితరాలకు ధన, మాన రక్షణ కరవైంది. కనుక ఏపీ లోని ఈ పరిస్థితులకు చలించిన కొంత మంది సినీ ప్రముఖులు కొన్ని పాటలను రూపొందించారు. కె.ఎస్‌. రామారావు, కొడాలి వేంకటేశ్వర్‌ రావులు కలిసి రెండు పాటలను రూపొందించారు. గుమ్మడి గోపాలకృష్ణ గారు ఇంతకుముందే 12 పాటలను రూపొందించి ఉన్నారు. ఇప్పుడు 13వ పాటను రూపొందించి ఆ పాటను పాడటం కూడా జరిగింది. ఈ పాటలను రూపొందించడంలో  ముఖ్యపాత్ర వహించిన ప్రతి ఒక్కరికీ అభినందనలను తెలియజేస్తున్నాన్నారు.  పార్టీ జాతీయ అధికార ప్రతినిధి  నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ...  ఇటువంటి అద్భుతమైన పాటలను వినే అదృష్టం తనకు కలిగిందని అన్నారు. వినడం, చూడటం ద్వారా సమాజం ప్రభావం ఉంటుందనీ,  జనం పడుతున్న అనేక రకాల ఇబ్బందులను  స్పష్టంగా మన కళ్లకు కనిపించే విధంగా, చెవులలో మారుమ్రోగే విధంగా పాటలు రాసి పాడిన వారికి, నటించిన వారికి ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలను తెలియజేస్తున్నానన్నారు.  కొన్ని పాటలు ప్రభుత్వాన్నే మార్చిన పరిస్థితులను చూశాం. జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం నిరంతరంగా శ్రమిస్తున్న  నారా చంద్రబాబు నాయుడు  నాయకత్వాన్ని బలపర్చడం కోసం తనకు తోచిన విధంగా సహకరిస్తున్న ప్రతివ్యక్తికి, పెద్దలందరికీ పేరుపేరున ధన్యవాదాలను తెలియజేస్తున్నానన్నారు.   అనంతరం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి  తిరునగరి జ్యోత్స్న మాట్లాడుతూ జగన్ పాలనలో ఏపీ ఎదుర్కొంటున్న పరిస్థితులను చూపించి ఏపీలో ప్రజా పరిపాలన రావాలనే ఉద్దేశంతో ప్రతి వర్గం కృషి చేస్తున్నదన్నారు.  రాష్ట్రం బాగు కోసం చలన చిత్ర రంగం తన  వంతు బాధ్యతగా  కంకణబద్దులై పని చేస్తున్నారని ప్రశంసించారు. ఈ పాటలలో ప్రతి వర్గం పడుతున్న బాధలను కళ్లకు కట్టడమే కాకుండా, ఆ బాధలను తీర్చగలిగే నాయకుడు ఎవరన్నది కూడా   మనసుకు హత్తుకునే లా తెలియజేశాయని ప్రశంసించారు.  పాటలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. జగన్ ఐదేళ్ల  అరాచక పాలనకు చరమగీతం పాడాలనీ,  అటువంటి ప్రభుత్వం గద్దె దిగాలని, ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి రావాలన్న సత్సంకల్పంతో  ఈ బృహత్తర ఆలోచన చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలిపారు. అనంతరం మాట్లాడిన ప్రముఖ నిర్మాత, కె.ఎస్‌. రామారావు  ఇంత మంది, ఇంత ఇన్సిపిరేషన్‌తో పాటలను రాసి, తీయడానికి ప్రధాన కారణం 45 డిగ్రీల ఎండలలోనూ చంద్రబాబు  ఏపీ ప్రజల కోసం కష్టపడుతుండటమేనన్నారు. చంద్రబాబు శ్రీమతి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్‌, నందమూరి బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్‌ గారు మండుటెండల్లో ఏపీ బాగుండాలని కష్టపడి పని చేస్తున్నారు. ఆ ఎండల ప్రభావం ఇక్కడ ఉండే మనకు తెలియదు. ఆ మండుటెండలు ఎలా ఉంటాయో ఏపీలోకి వెళ్లి చూస్తే   తెలుస్తుంది అన్నారు. ఏడు పదుల వయస్సులో  మండుటెండలో చంద్రబాబు  తిరుగుతుండటం చూసి స్ఫూర్తిని పొంది కొడాలి వేంకటేశ్వర్‌ రావు, గుమ్మడి గోపాలకృష్ణ గారు ముందుకు వచ్చి చేశారు. దేశానికి నాయకుడు కావాల్సిన చంద్రబాబు  తనను తాను తగ్గించుకుని  రాష్ట్రం కోసం పని చేస్తున్నారు, అటువంటి మనిషి ఏపీని అభివృద్ధి చేసుకుందామని ప్రజలను రిక్వెస్ట్‌ చేసుకుంటుంటే బాధ కలుగుతోందంటూ కేఎస్ రామారావు భావోద్వేగానికి గురయ్యారు.   ఏపీలో ఇంత దరిద్రపు పాలనను ఎవరూ ఊహించలేరు. చంద్రబాబు స్ఫూర్తితో ఉడతా భక్తిగా సహాయం చేయాలనే   ద్దేశంతో, టి.డి. జనార్థన్‌ గారి ప్రోత్సాహంతో ఈ పాటలను మీ ముందుకు తీసుకొస్తు న్నామన్నారు.  వీటిని మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం తీసుకురావాలి. ఏపీని బాగు చేసుకోవడానికి చంద్రబాబుకి మీ అందరి సహకారం కావాలి, ఆయనను గెలిపించుకోవడం మన అందరి బాధ్యత అని కేఎస్ రామారావు అన్నారు.  ఈ కార్యక్రమంలో మాట్లాడిన నిర్మాత నిర్మాత, కొడాలి వేంకటేశ్వర్‌ రావు ఈ పాటలను   టి.వి. పరిశ్రమ వారు, వర్కర్సు చేసినవి. ఈ కార్యక్రమాన్ని మొదట హేమంత్‌ అనే వ్యక్తి ప్రారంభించారు. నేను, కె.ఎస్‌. రామారావు   చేసింది తక్కువ. నాని, చక్రి, అశోక్‌, శ్రీనివాస్‌ వంటి వారు వెనుక ఉండి ఈ కార్యక్రమాన్ని షూట్‌ చేశారు. దీనిని డైరెక్టుగా షూట్‌ చేసి సాంగ్స్‌ ను చేశాం. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా పాటలను చేయడం జరిగింది. 175 నియోజకవర్గాలకు వీటిని రీఎడిట్‌ చేసి ప్రతి నియోజకవర్గానికి పనికివచ్చే విధంగా చేయబోతున్నాం. ఈ కార్యక్రమంలో గుమ్మడి గోపాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్‌  ప్రకాష్‌ రెడ్డి, శిరీషా, సీబీఎన్‌ వారియర్స్‌ తదితరులు పాల్గొన్నారు.
Publish Date: Apr 19, 2024 4:59PM

చీపురుపల్లిలో బొత్సకు ఎదురుగాలి.. బలంగా పుంజుకున్న కళా వెంకటరావు!

మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తున్నది. వైసీపీ సీనియర్ నాయకుడైన బొత్స ఇదే చీపురుపల్లి నియోజకవర్గం  నుంచి ఇప్పటి వరకూ మూడు సార్లు విజయం సాధించారు. 2004లో ఒకసారి, 2009 ఒకసారి ఆయన చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు. ఆ తరువాత వైసీపీలో చేరిన బొత్స 2019 ఎన్నికలలో విజయం సాధించి జగన్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. ఇప్పుడు మళ్లీ అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. చీపురుపల్లిలో బొత్స పరాజయం లక్ష్యంగా తెలుగుదేశం వ్యూహాత్మకంగా ఆలోచించింది. బొత్సకు దీటైన ప్రత్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అని భావించి ఆయనను అక్కడ నుంచి పోటీలోకి దింపాలని భావించింది.  గంటా ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఏ నియోజకవర్గం నుంచైనా విజయం సాధిస్తారని ప్రతీతి. అయితే చీపురుపల్లి నుంచి బరిలోకి దిగడానికి విముఖత చూపిన గంటా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి నుంచే పోటీ చేయడానికి ఇష్టపడ్డారు. బొత్సాపై పోటీకి గంటా నిరాకరించ డం తెలుగుదేశం పార్టీకి ప్రతికూల సంకేతాలు పంపిందని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. అయితే చీపురుపల్లిలో తెలుగుదేశం కష్టాలు అక్కడితో తీరిపోలేదు. గంటా పోటీకి నిరాకరించడంతో తెలుగుదేశం అధినేత చివరి నిముషంలో చీపురుపల్లి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా కళా వెంకటరావును నిలిపారు. అయితే ఆ ఎంపిక పార్టీలో సీనియర్ నాయకుడికి టికెట్ నిరాకరించకుండా అకామిడేట్ చేసినట్లుగానే కనిపించింది.  దీంతో చీపురుపల్లిలో తెలుగుదేశం క్యాడర్ కూడా నిరుత్సాహపడింది. అక్కడ నాగార్జున గత కొంత కాలంగా పని చేసుకుంటూ క్షేత్ర స్థాయిలో మంచి పట్టు సాధించారు. అయితే చంద్రబాబు రాజాం నుంచి తీసుకువచ్చి కళా వెంటకరావుకు పార్టీ టికెట్ ఇవ్వడంతో ఆయన ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులన్నీ చీపురుపల్లిలో గంటా గెలుపు నల్లేరు మీద బండికగా మార్చేశాయని అప్పట్లో పరిశీలకులు సైతం విశ్లేషించారు. అయితే అనూహ్యంగా చీపురుపల్లిలో పరిస్థితి రోజురోజుకూ మారిపోతోంది. తీవ్ర మైన ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా నియోజకవర్గంలో బొత్సకు ఎదురు గాలి వీస్తున్నది.  నియోజకవర్గంలో అత్యంత కీలకమైన మెరకమూడిదాం మండలంలో  తెలుగుదేశం పార్టీకి గట్టి మద్దతు లభించింది. అక్కడ కళా వెంకట్ రావు సమక్షంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి చేరికలు జరిగాయి. అలాగే నియోజకవర్గంలోని పలు ఇతర మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరికలు పెరిగాయి. ఈ పరిస్థితులను చూస్తుంటే బొత్సకు చీపురుపల్లిలో విజయం అంత వీజీ కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
Publish Date: Apr 19, 2024 4:33PM

ఆశల పల్లకిలో కేసీఆర్!

అధికారం కోల్పోయినా కేసీఆర్ ఇంకా తానే ముఖ్యమంత్రినన్న భ్రమల్లో ఊరేగుతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఎన్నికల సందర్భంగానూ అంతర్గత సర్వేలు తమ పార్టీ ఘన విజయాన్నే సూచిస్తున్నాయని చెబుతూ పార్టీ నేతలూ, క్యాడర్ లో ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ నింపేవారు. సరిగ్గా అదే విధంగా గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన ఎన్నికలకు ముందు కూడా తాను అంతర్గతంగా నిర్వహించిన సర్వేలలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ఢంకా బజాయించి మరీ చెప్పారు. అయితే వాస్తవ ఫలితం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా ఆయన దాదాపుగా అటువంటి సర్వేలపైనే ఆధారపడ్డారు. లోక్ సభ ఎన్నికల తరువాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో పెనుమార్పులు అనివార్యమనీ, మళ్లీ బీఆర్ఎస్ హవా నడుస్తుందని పార్టీ నేతలను, శ్రేణులనూ నమ్మించే ప్రయత్నం చేశారు. లోక్ సభ ఎన్నికలలో పెటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్ లు అందజేసిన కేసీఆర్ పాతిక మంది కాంగ్రెస్ నేతలు తనతో టచ్ లో ఉన్నారనీ, లోక్ సభ ఎన్నికల తరువాత వారంతా బీఆర్ఎస్ గూటికి చేరుతారనీ చెప్పుకొచ్చారు. అంతే కాదు.. ఓ 20 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి ఫిరాయించడానికి రెడీగా ఉన్నారని చెప్పారు. ఆయన మాటలలో వాస్తవం సంగతి పక్కన పెడితే.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆయన చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు రివర్స్ లో బీఆర్ఎస్ ను ఖాళీ చేస్తున్న విషయాన్ని ఆయన ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ దే పై చేయి అనీ రాష్ట్రంలో తన మాటే చెల్లుబాటు అవుతుందనీ భ్రమపడుతున్నారు.   లొక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ రాష్ట్రంలో కచ్చితంగా ఎనిమిది స్థానాలలో విజయం సాధిస్తుందనీ, మరో మూడు స్థానాల్లో కేడా గెలిచే అవకాశాలున్నాయనీ తన అంతర్గత సర్వేలో తేలిందని చెప్పుకొచ్చిన ఆయన ఆ సర్వే ఎప్పుడు ఎవరితో చేయించారో వెల్లడించలేదు. అధికారంలో ఉన్న సమయంలో అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు ద్వారా సర్వేలు చేయించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన ఇటువంటి అంతర్గత సర్వేలకు పార్టీపైనే ఆధారపడాలి. విపక్షంగా మారిన క్షణం నుంచీ బీఆర్ఎస్ స్థిమితంగా ఉన్న పరిస్థితి లేదు. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నిక దగ్గర నుంచీ అంతటా కేసీఆర్ కు ఇబ్బందికరంగానే పార్టీ నేతలూ, కేడర్ వ్యవహరించారు.  ఇంతకీ ఆయన ధీమా ఏమిటంటే 104 సీట్లు వచ్చినప్పుడే  బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నించింది. 64 సీట్లతో కాంగ్రెస్‌నుఅధికారంలో ఎలా కొనసాగనిస్తుందన్నది ఆయన ధీమా. అదే జరిగితే  భవిష్యత్తు బీఆర్‌ఎస్‌దే  అని కేసీఆర్  ఊహలపల్లకిలో ఊరేగుతున్నారు.  అయితే ఆయన కాంగ్రెస్ నేతలు తనతో టచ్ లో ఉన్నారని చెప్పి 24 గంటలు గడవక ముందే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, అదీ గ్రేటర్ పరిధిలోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన కాంగ్రస్ కండువా కప్పుకోనున్నారు. అలాగే ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆయనా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయి. ఇటీవల ఒక సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పాతిక మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చారనీ, ఏ క్షణంలోనైనా వారు ‘చేయి’ అందుకుంటారనీ చెప్పారు. విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు లోక్ సభ ఎన్నికల తరువాత నుంచీ బీఆర్ఎస్ నుంచి సిట్టింగుల వలసల వరద ప్రారంభ మౌతుందంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ చెబుతున్న మాటలు, వ్యక్తం చేస్తున్న విశ్వాసంపై బీఆర్ఎస్ నేతలు భరోసా ఉంచగలరా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 
Publish Date: Apr 19, 2024 3:43PM

రేవంత్ దూకుడు.. 14లోక్ సభ స్థానాల్లో గెలుపే టార్గెట్!

 తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల హీట్ తార స్థాయికి చేరింది.  నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్నది. పార్టీల అధిష్టానాల నుంచి బీఫారంలు అందుకున్న అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌గా.. అధికార కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు నియోజకవర్గాలలో అభ్యర్థులను ఇంకా  ప్ర‌క‌టించాల్సి ఉంది. ముఖ్యంగా ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థి ఎంపిక‌పై కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మ‌రోవైపు తెలంగాణ‌లో 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర‌వేసేలా సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌త్యేక దృష్టి కేంద్రీక‌రించారు. అందుకు త‌గ్గట్లుగా వ్యూహాల‌ను అమ‌లు చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా సీఎం రేవంత్ రెడ్డి అమ‌లు చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని అమలు కాలేదు. అయితే హామీల అమలు విషయంలో రేవంత్ చిత్తశుద్ధి కారణంగా   ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్  గ్రాఫ్ పెరిగింది. మూడు నెల‌ల కాలంలో ఇచ్చిన హామీల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు ప‌రిష్క‌రించామ‌ని, ఎన్నిక‌ల కోడ్ తొల‌గించిన వెంట‌నే మిగిలిన హామీల‌ను అమ‌లు చేస్తామ‌ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డం ద్వారా వారి నుంచి మ‌రింత మ‌ద్ద‌తు పొందేలా కాంగ్రెస్ పార్టీ దృష్టి కేంద్రీక‌రించింది.  లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల గెలుపు బాధ్య‌త‌ల‌ను సీఎం రేవంత్ రెడ్డి భుజానికెత్తుకున్నారు. దీంతో రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేయ‌నున్నారు. తమ ప్రభుత్వ పాలనకు పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండమ్ అని ఇప్పటికే  ప్రపకటించిన రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్ర‌చారానికి శ్రీకారం చుట్టారు.   మే 11వ తేదీ వరకు 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 50 సభలు, ర్యాలీలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. శుక్ర‌వారం (ఏప్రిల్ 19) మహబూబ్ నగర్ లో పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌.. సాయంత్రం మహబూబాబాద్ లో జరిగే బహిరంగ సభ లో పాల్గొంటారు. ఈనెల 20న మెదక్ అభ్యర్థి నీలం మధు మద్దతుగా ర్యాలీ, సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. 21న భువనగిరి లో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. 22న మధ్యాహ్నం ఆదిలాబాద్ లో నిర్వహించే సభ లో పాల్గోనున్న రేవంత్‌.. 23న నాగర్ కర్నూల్, 24న ఉదయం జహిరాబాద్, సాయంత్రం వరంగల్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర్వ‌హించే స‌భ‌ల్లో పాల్గొంటారు. 25న చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మద్దతుగా ర్యాలీలో పాల్గొని అనంత‌రం జ‌రిగే సభలో రేవంత్ రెడ్డి ప్ర‌సంగిస్తారు. ఇలా మే 11వ తేదీ వ‌ర‌కు  రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సుడిగాలి ప‌ర్య‌టన‌లు చేయ‌నున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి పార్టీలో చేరిక‌ల జోరు రోజురోజుకు పెరుగుతోంది. బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నేత‌లు క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టికే బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేంద‌ర్, క‌డియం శ్రీ‌హ‌రి, తెల్లం వెంక‌ట్రావులు కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. తాజాగా రాజేంద్ర‌న‌గ‌ర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని క‌లిశారు. రెండు రోజుల్లో ఆయ‌న‌సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవ‌కాశం ఉంది. గ్రేట‌ర్‌లో మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మీ, డిప్యూటీ మేయ‌ర్ తో పాటు కొంద‌రు కార్పొరేట‌ర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ ఎస్ నుంచి ముఖ్య‌నేత‌లు, ద్వితీయ శ్రేణి నేత‌లు కాంగ్రెస్ లోకి క్యూ క‌డుతుండ‌టంతో పార్టీ బ‌లం రోజురోజుకు పెరుగుతున్నది.   దీంతో రాష్ట్రంలో 17 లోక్‌స‌భ స్థానాల్లో 14  నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ నేత‌లు ధీమాతో ఉన్నారు.  కాంగ్రెస్ పార్టీ మూడు నెల‌ల పాల‌నకు పార్ల‌మెంట్ ఎన్నిక‌లు రెఫ‌రెండమ్ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బ‌కొట్ట‌డం ద్వారా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీది గాలివాటం గెలుపేన‌ని నిరూపించేందుకు బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  మ‌రోవైపు బీజేపీ అధిష్టానంసైతం కాంగ్రెస్ కు షాకిచ్చేందుకు సిద్ధ‌మ‌వుతుంది. ఇప్ప‌టికే బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీల నేత‌లు రేవంత్ రెడ్డి మూడు నెల‌ల పాల‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇచ్చిన హామీల‌ను అమలు చేయ‌డంలో రేవంత్ స‌ర్కార్ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని, కేవ‌లం ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్ట‌డానికే అధికారాన్ని వినియోగిస్తున్నార‌ని మాజీ సీఎం కేసీఆర్ విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీరును ఎండ‌గ‌తామ‌ని అన్నారు. అయితే,  బీజేపీ, బీఆర్ ఎస్   నేత‌ల నుంచి ఎదుర‌య్యే విమ‌ర్శ‌ల‌కు రేవంత్ రెడ్డి  ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాధానం ఇస్తూ తిప్పికొడుతున్నారు. తాజాగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌ల‌కు సిద్ధ‌మ‌య్యారు. ఈ ప‌ర్య‌ట‌న‌ల్లో ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్ట‌డంతోపాటు.. రాబోయే కాలంలో ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అండ‌గా ఉంటుందో స్ప‌ష్టం చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ అధిష్టానం టార్గెట్ ను రేవంత్ ఏమేర‌కు రీచ్ అవుతాడ‌నే అంశం తెలంగాణ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.
Publish Date: Apr 19, 2024 2:59PM

రేవంత్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ.. త్వరలో కాంగ్రెస్ గూటికి!?

లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే  ప్రకాష్ గౌడ్ శుక్రవారం (ఏప్రిల్ 19) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే ఆయన కేవలం మర్యాదపూర్వకంగా నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు రేవంత్ రెడ్డిని కలవలేదు. తాను తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ గూటికి చేరుతామని చెప్పడానికే రేవంత్ రెడ్డిని కలిశారని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నది. ఇలా ఉండగా గత కొంత కాలంగా ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.  తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత లోక్ సభ ఎన్నికల తరువాత రాజకీయాలలో పెను మార్పులు సంభవిస్తాయనీ, కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశం ఉందనీ, ఇప్పటికే 20 మంది వరకూ తమతో టచ్ లో ఉన్నారనీ చెప్పి 24 గంటలు గడవక ముందే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో టచ్ లోకి వెళ్లడం విశేషం. వసలను నిరోధించడానికే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పారని ప్రకాష్ గౌడ్ ఉదంతంతో తేటతెల్లమైంది. కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాతిక మంది  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లోకి వచ్చారనీ, వీరంతా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారనీ చెప్పిన సంగతి తెలిసిందే.  మొత్తం మీద సిట్టింగులను కాపాడుకోవడంలో, వలసలను నివారించడంలో బీఆర్ఎస్ అధినాయకత్వొం చేతులెత్తేసినట్లే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Apr 19, 2024 12:14PM

ఉత్తరాదిలో కానరాని బీజేపీ హవా.. ఆర్ఎస్ఎస్ చెబుతున్నది నిజమేనా?

సార్వత్రిక ఎన్నికలలో   మిత్రపక్షాలతో కలిసి నాలుగొందలకు పైగా స్థానాలలో విజయం అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఉత్తుత్తి ప్రచారార్భాటమేనా.. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో కమలం పార్టీకి అంత సీన్ లేదా అంటే  కమలం పార్టీ మెంటార్ ఆర్ఎస్ఎస్ ఔననే అంటోంది.  అలాగే ప్రముఖ రాజకీయ, ఆర్థిక వేత్త డాక్టర్ పరకాల ప్రభాకర్ కూడా ఉత్తరాదిలో బీజేపీ గ్రాఫ్ డౌనైందంటున్నారు.   దేశంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న కమలం పార్టీపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని ఆయన వివరిస్తున్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా, అలాగే కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ కూడా బీజేపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ 400 స్థానాలు అని గొప్పలు చెప్పుకుంటోందనీ, క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే ఆ పార్టీ కనీసం 200 స్థానాలలో విజయం సాధించడం కూడా కష్టమేననీ చెబుతున్నారు.  ఆర్ఎస్ఎస్ వినా బీజేపీ గ్రాఫ్ పడిపోతోందన్న అభిప్రాయాలన్నీ  రాజకీయ వైరంతో చెబుతున్న మాటలు, జోశ్యాలుగా కొట్టి పారేసినా బీజేపీ మెంటార్ రాష్ట్రీయస్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం మాత్రం ఆలోచించాల్సిందేనంటున్నారు పరిశీలకులు. ఆర్ఎస్ఎస్ దేశ వ్యాప్తంగా నిర్వహించిన అంతర్గత సర్వేలో   ఈ సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ రెండోందలకు మించి స్థానాలను గెలుచుకునే పరిస్థితి లేదని తేలింది. ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ వర్గాలే చెబుతున్నాయి.  ఆర్ఎస్ఎస్ అంచనా ప్రకారం 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ గణనీయంగా సీట్లను నష్టపోతున్నది. ఆర్ఎస్ఎస్ చెబుతున్న దానిని బట్టి చూస్తే బీజేపీ సొంతంగా 178 స్థానాలలో మాత్రమే విజయం సాధించే అవకాశం ఉంది.  అంటే క నీసం 300 స్థానాల సొంతంగా విజయం అన్న బీజేపీ లక్ష్యం నెరవేరే చాన్సే లేదు.   వాస్తవానికి గత కొన్ని నెలలుగా పరిశీలకులు వైసీపీకి ఉత్తరాదిలో ఆదరణ తగ్గుతోందంటూ విశ్లేషణలు చేస్తున్నారు. ఆక్కడ తగ్గే స్థానాలను దక్షిణాదిలో భర్తీ చేసుకోవాలన్న ఉద్దేశంతో బీజేపీ హైకమాండ్ ఉందని అంటున్నారు. అయితే దక్షిణాదిలో ఒక్క కర్నాటక వినా ఆ పార్టీకి పెద్దగా కలిసి వచ్చే పరిస్థితి లేకపోవడంతో.. నిన్న మొన్నటి వరకూ అక్కర్లేదు మేమే చాలు అంటూ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను దూరం చేసుకున్న కమలనాథులు ఇప్పుడు చిన్నా చితకా పార్టీలను కూడా ఎన్డీయేలోకి ఆహ్వానిస్తూ.. మరో సారి అధికారంలోకి వస్తే కచ్చితంగా మిత్రధర్మాన్ని పాటించి భాగస్వామ్య పక్షాలకు సముచిత ప్రాధాన్యతను ఇస్తామని నమ్మకంగా చెబుతున్నారు.   ఉత్తరాదిలో బలమైన   రాజపుట్లు ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మారడం కూడా ఆ పార్టీకి ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడేందుకు కారణమైందని అంటున్నారు.   బీజేపీ ప్రముఖుడు ఇటీవల రాజ్‌పుట్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఆ ప్రభావం ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో బీజేపీపై ప్రతికూల ప్రభావాన్ని చూపడానికి కారణమయ్యాయి.    ఇక ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం కూడా, బీజేపీకి మైనస్ అయ్యిందన్నది పరిశీలకుల విశ్లేషణ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌బీఐ ఇటీవల వెల్లడించిన  వివరాలలో  ఈడీ-సీబీఐ కేసులకు గురైన కంపెనీలన్నీ తర్వాత, బీజేపీకి భారీ మొత్తంలో  ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా విరాళాలు ఇచ్చాయతేలడం బీజేపీకి భారీ నష్టం చేకుర్చనుందని అంటున్నారు. ఏయే కంపెనీ బీజేపీకి ఎంతెంత విరాళాలు ఇచ్చిందన్న వివరాలు గత కొద్దిరోజు నుంచి మీడియాలో శరపరంపరగా వస్తూనే ఉన్నాయి. అది సహజంగానే బీజేపీకి కొంత నష్టం కలిగి ఉండవచ్చంటున్నారు. 
Publish Date: Apr 19, 2024 11:54AM