పొలిటికల్ వార్ ట్యాంక్ రెడీ..జనసేనాని సిద్ధమయ్యారా?
Publish Date:Dec 7, 2022
Advertisement
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ యుద్ధానికి వార్ ట్యాంక్ రెడీ అయ్యింది. ఆ వాహనానికి వారాహి అని నామకరణం కూడా చేశారు. జనసేనాని రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ఈ వాహనాన్ని వినియోగిస్తారు. ఇప్పటికే ఆయన ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని ప్రకటించిన సంగతి విదితమే. ఇందు కోసం ప్రత్యేక వాహనాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చైతన్యరథంపై రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన పర్యటన ప్రభంజనం సృష్టించిన సంగతి విదితమే. ఇప్పుడు పవన్ కల్యాన్ కూడా నాటి చైతన్య రథాన్ని పోలినట్లు ఉండేలా తన వాహనాన్ని తీర్చి దిద్దారు. చూడగానే యుద్ధ ట్యాంకును స్ఫురింప చేసేలా ఆ వాహనానికి తుది మెరుగులు దిద్దారు. హైదరాబాద్ లోని ఓ గ్యారేజీలో ఈ వాహనానికి తన పర్యటన అవసరాలకు తగినట్లుగా మార్పులు, చేర్పులు చేయించిన పవన్ కల్యాణ్ బుధవారం (డిసెంబర్ 7) ట్రయల్ రన్ ను కూడా చేశారు. అనంతరం స్వయంగా తన ఎన్నికల వార్ ట్యాంక్ వారాహి ఫొటోలను ట్వీట్ చేశారు. రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ అన్న క్యాప్షన్ కూడా పెట్టారు. ఇంత వరకూ బానే ఉంది. నాడా దొరికింది.. ఇక గుర్రాన్ని వెతుకుదాం అన్నట్లుగా ఉంది.. యాత్ర షెడ్యూల్ లేకుండా వాహనాన్ని ప్రదర్శించి ఫొటోలను ట్వీట్ చేయడం అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. నిజమే వరుస సినిమాల బిజీ షెడ్యూల్ మధ్యలో ఆయన ఈ వాహనంపై రాష్ట్ర వ్యాప్త పర్యటన అంటున్న బస్సు యాత్ర ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయంలోనే స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే ఆయన బస్సు యాత్ర అంటూ రెండు మూడు సార్లు తేదీలు ప్రకటించి వాయిదాలు వేశారు. అంతే కాదు ఇటీవల హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తాను రాజకీయాలలో ఫెయిలయ్యానని స్వయంగా ప్రకటించారు. పరీక్షల(ఎన్నికల)కు ముందే తన ఫెయిల్యూర్ ను ప్రకటించిన జనసేన అయినా పోరాటం ఆపనంటూ బస్సు యాత్ర కోసం ‘వారాహి’ని సిద్ధం చేసుకున్నారు. అయితే వరుస సినిమాల బిజీ షెడ్యూల్స్ మధ్య ఆయన ఎన్నికల పోరాటం ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎలా కొనసాగిస్తారు అన్న సందేహాలు జనసేన శ్రేణుల్లోనే వ్యక్తమౌతున్నాయి. అటు సినిమాలు, ఇటు రాజకీయాలు అంటూ పవన్ కల్యాణ్ రెండు పడవలపై కాళ్లు పెట్టి చేస్తున్న ప్రయాణం వల్లే ఆయనను ఇంకా సినీహీరోలానే జనం చూస్తున్నారు తప్ప రాజకీయ నాయకుడిగా గుర్తించడం లేదు. సినిమా హీరోగా ఆయనకు అశేష అభిమాన జనసందోహం ఉండి ఉండొచ్చు.. కానీ రాజకీయ నాయకుడిగా ఆయన జనం విశ్వాసాన్ని పొందలేకపోయారన్నదానికి గత ఎన్నికలలో జనసేనకు వచ్చిన ఓట్లు, సీట్లే నిదర్శనం. అప్పటికీ, ఇప్పటికీ ఏం మారిందనడానికి సర్వేలను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఆయన ప్రసంగాలు, రాజకీయ కార్యక్రమాలకు, పార్టీ నిర్మాణానికి, పార్టీ వ్యవహారాలకు ఆయన ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారన్నది చూస్తే ఇట్టే అవగతమై పోతుంది. సినిమాల్లో అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కచ్చితంగా షూటింగ్ లో పాల్గొని కమిట్ మెంట్ ప్రకారం పూర్తి చేయాల్సిందే. లేకుంటే నిర్మాతలు నష్టపోతారు. సినిమా హీరోలంతా నిర్మాతలు నష్టపోకూడదు అంటు తరచూ చెబుతుంటారు. పవన్ కల్యాణ్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. అందుకే ఆయన ఇప్పటికే ఒప్పుకున్న, కొత్తగా అంగీకరించిన సినిమాలకే ఆయన తన పొలిటికల్ యాక్టివిటీస్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. పవన్ కళ్యాణ్ ఓ వైపు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తూనే పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవలే ఆయన మరో సినిమాని ప్రకటించారు. ఇక గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుందని చెబుతున్నారు. అదే సమయంలో బస్సు యాత్ర చేస్తాననీ, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో పర్యటించి పార్టీ బలోపేతం చేయడంతో పాటు.. ప్రజలకూ చేరువ కావాలని పవన్ కల్యాణ్ వ్యూహరచన చేస్తున్నారు. కార్యాచరణ రూపొందిస్తున్నారు. జనవరి 2023 నుంచి, పవన్ కళ్యాణ్ బస్సుయాత్ర ప్లాన్ చేసుకున్నారు. బస్సు కూడా రెడీ అయింది.అయితే పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు డేట్స్ ఎలా అడ్జెస్ట్ చేస్తారన్న అనుమానాలు మాత్రం పార్టీ శ్రేణుల్లో బలంగా వ్యక్తమౌతున్నాయి. ఇందుకు ఆయన వరసగా సినిమాలను అంగీకరిస్తూ ఉండటమే కారణం. ఎందుకంటే ఇప్పటికే ఆయన అంగీకరించిన సినిమా షూటింగ్ కు పూర్తి అయ్యే సరికే పుణ్య కాలం కాస్తా గడిచిపోయేటట్లు ఉంది. అదీ కాక పరిశీలకులు అంచనా వేస్తున్నట్లుగానూ, జగన్ సర్కార్ తరును బట్టి జనం కూడా భావిస్తున్నట్లుగా ముందస్తు ఎన్నికలకు వస్తే అసలు పవన్ కల్యాణ్ బస్సుయాత్ర మాట దేవుడెరుగు అసలు తన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారమైనా చేయగలుగుతారా అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. ఇన్ని సందిగ్ధతల మధ్య ఆయన ‘వారాహి’ రెడీ అంటూ చేసిన ట్వీట్ వెంటనే వైరల్ అవ్వడమే కాదు.. ట్రోలింగ్ కూ గురౌతోంది.
http://www.teluguone.com/news/content/political-war-tank-ready-is-pawan-ready-for-battle-39-148230.html