వెంకన్నను వెంటాడి వేటాడారు!.. ధూళిపాళ్ల, పట్టాభిలానే మరో ఫైర్బ్రాండ్ అరెస్ట్..
Publish Date:Jan 24, 2022
Advertisement
ఎట్టకేళకు టీడీపీ నేత బుద్ధా వెంకన్నను అరెస్ట్ చేసి కసి తీర్చుకుంది జగన్ ప్రభుత్వం. ఆయన ఎక్కడ దొరకుతారా అని ఎప్పటి నుంచో కాచుకు కూర్చొంది. టీడీపీలో పెద్ద నోరున్న నేతగా.. నిత్యం వైసీపీ సర్కారును కుళ్లబొడిచే వెంకన్నపై జగన్ అండ్ కో కొంతకాలంగా రగిలిపోతోంది. అసలే బెజవాడ. అందులోనూ బుద్దా. ఇక ఆయన దూకుడుకు, నోటికి ఎదురుంటుందా? అదే వైసీపీకి ఇబ్బందిగా మారింది. అందుకే, పదే పదే వెంకన్నను టార్గెట్ చేసింది. ఓసారి భౌతిక దాడులకు తెగబడగా.. తృటిలో తప్పించుకున్నారు. ఇక లాభం లేదని.. తన అనధికార సైన్యాన్ని రంగంలోకి దింపినట్టుంది. ఆయన ప్రెస్మీట్లలో లూజ్ లైన్స్ను క్యాచ్ చేసి.. కార్నర్ చేసింది. అరెస్ట్తో మరో టీడీపీ నేతను బెదిరించి, భయపెట్ట, నోరు మూయించే ప్రయత్నం చేస్తోంది. ధూళిపాళ్ల, పట్టాభిలానే మరో ఫైర్బ్రాండ్ లీడర్పై పంజా విసిరింది జగన్ ప్రభుత్వం. బుద్దా వెంకన్న మొదటినుంచీ వైసీపీ టార్గెట్గానే ఉన్నారు. ఓసారి ఆయనపై దాడులకు తెగబడ్డారు. కనిపిస్తే దాడులు.. కుదిరితే కేసులు.. వీలైతే హత్యలు.. ఏపీలో వైసీపీ మూకల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. ఇటీవల పల్నాడులో చంద్రయ్యను వైసీపీ నాయకులు నడిరోడ్డుపై దారుణంగా చంపేశారు. ఆ తర్వాత గుడివాడలో టీడీపీ నేత బోండా ఉమాపై మరోసారి హత్యాయత్నానికి పాల్పడ్డారు. అంతకుముందు, బోండా ఉమాతో పాటు బుద్దా వెంకన్నపై పల్నాడులో మర్డర్ అటెంప్ట్ జరిగింది. గతంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో మాచర్లలో బోండా ఉమా, బుద్దా వెంకన్నలు ప్రయాణిస్తున్న కారును.. వైసీపీ రౌడీలు కొన్ని కిలోమీటర్ల పాటు వెంబడించి దాడి చేశారు. తురక కిశోర్ అనే వైసీపీ లీడర్ పెద్ద కర్రతో.. బుద్దా వెంకన్నపై దాడి చేశాడు. కారు అద్దాలు పగలగొట్టి.. కారు లోపల ఉన్న నేతలను ఆ కర్రతో కొట్టాడు. కానీ, తృటిలో తప్పించుకుని.. కారును వేగంగా నడిపి.. ఆ హత్యాయత్నం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. అయినా, వదలకుండా కారును వైసీపీ వర్గాలు వెంబడించగా.. స్థానిక పోలీసులు తమ వాహనంలో బుద్దా వెంకన్న, బోండా ఉమాలను సురక్షితంగా విజయవాడ తరలించారు. ఆనాడు బుద్దా, బోండాలను చంపాలని చూసిన తురక కిశోర్కు ఆ తర్వాత మున్సిపల్ ఛైర్మన్ పదవి కట్టబెట్టిన ఘనత వైసీపీది. రౌడీలకు ఆ పార్టీలో అధిక ప్రాధాన్యం ఉంటుందనే దానికి ఆ ఘటనే నిదర్శనం. ఇప్పటి వరకూ వైసీపీ వర్గీయుల చేతిలో 33 మంది టీడీపీ నాయకులు హత్యకు గురయ్యారు. 500 మందికి పైగా గాయపడ్డారు. ఇక కేసుల సంఖ్య అయితే లెక్కేలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి మాజీ మంత్రులు, అధికార ప్రతినిధులు, కార్యకర్తల వరకు.. అనేక వందల మందిని ఏదో ఒక కేసులో ఇరికించింది వైసీపీ ప్రభుత్వం. అయినా ఆగకుండా.. చంద్రబాబు ఇంటిపై ముట్టడి.. మంగళగిరి పార్టీ ఆఫీసు ధ్వంసం.. లాంటి విధ్వంసకాండ కొనసాగిస్తూనే ఉంది. రాజారెడ్డి రాజ్యాంగం.. కడప ఫ్యాక్షన్ అంటూ టీడీపీ ఎన్ని విమర్శలు చేస్తున్నా.. డీజీపీ కొమ్ము కాస్తున్నారంటూ ఎంతగా ఆరోపిస్తున్నా.. ఏపీలో వైసీపీ మూకల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. వారి అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. ఇక, బుద్దా వెంకన్న నోరు మూయించడం వైసీపీ మూకల పని కావట్లేదని భావించారో ఏమో.. పోలీసులను ఆయనపైకి పంపించారని టీడీపీ మండిపడుతోంది. తాజాగా, విచారణ పేరుతో విజయవాడ టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్నను అరెస్టు చేయడం కలకలం రేపింది. ముఖ్యమంత్రి, కొడాలి నాని, ఏపీ డీజీపీలపై విమర్శలు గుప్పించారన్న కారణం మీద పోలీసులు బుద్ధా వెంకన్న ఇంటికెళ్లి మరీ అరెస్టు చేశారు. ఏపీలో విపరీతమైన అణచివేత కొనసాగుతోందని, పోలీసులు కూడా అధికార పార్టీ కనుసన్నల్లోనే వ్యవహరిస్తున్నారని నినాదాలు చేశారు. గతంతో ధూళిపాళ్ల నరేంద్రను పాత కేసుల్లో కొత్తగా అరెస్ట్ చేసి వేధించారని అంటారు. ఇక బోసిడికే డైలాగ్ను పట్టుకొని పట్టాభి విషయంలో నానా రచ్చ చేశారు. ధూళిపాళ్ల, పట్టాభిలానే ఇప్పుడు బుద్దా వెంకన్నను అటాక్ చేశారని అంటున్నారు. గుడివాడ ఘటన తరువాత టీడీపీ నేతల విమర్శలను కూడా జీర్ణించుకోలేకపోతున్న పోలీసులు.. తామేం చేసినా చూస్తూ ఉండాల్సిందే తప్ప ఎదురు ప్రశ్నిస్తే ఎందాకైనా వస్తామన్నట్టుగా వారి ప్రవర్తన ఉందన్న వ్యాఖ్యానాలు ఈ అరెస్టు తరువాత వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే కె.కన్వెన్షన్ ఎపిసోడ్ కు కొనసాగింపుగా కొడాలి నానిపై, రాష్ట్ర పోలీసు బాసు డీజీపీ గౌతమ్ సవాంగ్ పై విమర్శలు ఎక్కుపెట్టినందుకు బుద్ధా వెంకన్నను అరెస్టు చేసి లోపలేశారు. పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారారంటూ తీవ్రస్థాయిలో ఆక్రోశం వెళ్లగక్కిన టీడీపీ నేతలను వివరణల పేరుతో అరెస్టు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ అరెస్టులు ఒక్క వెంకన్నతోనే ఆగిపోవని, మరిన్ని అరెస్టులతో ప్రతిపక్షంలో భయాందోళనలు రేపే కుట్ర జరుగుతోందంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వెంకన్న కామెంట్లను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు అసలు కొడాలి నాని కామెంట్లను ఎందుకు కౌంట్ లోకి తీసుకోవడం లేదని నిలదీస్తున్నారు. పార్టీ అధినేత మీద ఎంత దారుణంగా మాట్లాడాడో ప్రపంచమంతా చూసింది. అయినా పోలీసులకు ఆ విషయమే తెలియనట్టు.. కేవలం బుద్ధా వెంకన్న కామెంట్లను మాత్రమే కౌంట్ లోకి తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా కక్ష్య సాధింపు చర్యలేనని మండిపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/controversy-over-budda-venkanna-arrest-39-130681.html