ఒక్క ఆదేశం.. నేతల తీరులో మార్పు.. చంద్రబాబు హ్యాపీ!
Publish Date:Dec 2, 2025
Advertisement
కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయాలలో ఇసుమంతైనా వెనుకాడకుండా ముందుకు అడుగులు వేస్తున్నది. అయితే వేళ్ల మీద లెక్కపెట్టేంత మంది నాయకులు, ఎమ్మెల్యేలు వినా మిగిలిన వారంతా పెద్దగా ప్రజల మధ్యకు రావడం లేదు. చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యక్రమాలలో పాలుపంచుకోవడం లేదు. ఇది ఎవరో ప్రత్యర్థులు చెబుతున్న మాట కాదు. స్వయంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో పలు మార్లు చెప్పిన మాట. ఈ విషయంలో ఆయన తన అసంతృప్తిని ఇసుమంతైనా దాచుకోలేదు. బాహాటంగానే ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పద్ధతి మార్చుకోవాలని ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ముఖ్యంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో నాయకులు పట్టనట్లు వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా గర్హించారు కూడా. ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు. చంద్రబాబు చెప్పారు, ఇక తప్పదన్నట్లు పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు. ప్రజలతో మమేకం కావడం లేదు. అదేదో తమకు సంబంధించని ఓ ప్రభుత్వ కార్యక్రమంలా భావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఓ స్పష్టమైన ఆదేశం జారీ చేశారు. అది సత్ఫలితాలను ఇచ్చింది. ఇంతకీ ఆ ఆదేశం ఏమిటంటే.. పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఫొటోలు దిగి వాటిని పార్టీ కార్యాలయ వెబ్ సైట్ లో పోస్టు చేయాలి. కార్యక్రమం ప్రారంభం, ముగింపు ఇలా రెండు సమయాల్లోనూ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులుఫొటోలు దిగాలనీ, వాటిని పార్టీ ఆఫీస్ వెబ్ సైట్ లో పోస్టు చేయాలన్న చంద్రబాబు ఆదేశాలతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇంత కాలం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తూతూ మంత్రంగా పాల్గొంటున్న వారూ, మొత్తానికే డుమ్మా కొట్టేస్తున్న వారూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. దీంతో సోమవారం (డిసెంబర్ 1)న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో దాదాపు 90శాతం మంది పాల్గొన్నారు. కేవలం పాల్గొనడమే కాదు.. ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకూ ప్రజలలో మమేకం అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు పార్టీ కార్యాలయ వెబ్ సైట్ లో పోస్టు చేశారు. దీంతో పార్టీ కార్యాలయ సిబ్బంది ఎవరెవరు ఎక్కడెక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్న వివరాలను గణాంకాలతో సహా చంద్రబాబుకు నివేదించారు. ఈ గణాంకాల ప్రకారం తాజాగా జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో 90 శాతం మంది నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. నేతలలో వచ్చిన మార్పు ను స్వాగతించారు. మిగిలిన పది శాతం మంది కూడా ముందుకు రావాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో వంద శాతం నాయకులు పాల్గొనాలనీ సూచించారు.
http://www.teluguone.com/news/content/cbn-happy-with-change-in-leaders-25-210352.html





