ఫలితాలకు ముందే క్యాంపు రాజకీయాలు
Publish Date:Dec 8, 2022
Advertisement
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గుజరాత్ లో కమల దళం దూసుకుపోతోంది. రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు నమోదైన రికార్డులు అన్నిటినీ, బద్దలు కొట్టి బీజేపీ 150కి పైగా స్థానాల్లో ముందంజలో వుంది. గత ఎన్నికలో బీజేపీకి చెమటలు పట్టించి 77 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి పూర్తిగా చతికిల పడింది. అయితే హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం అందరు ఉహించిన విధంగానే, బీజేపే, కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా చాలా చాలా గట్టి పోటీ నెలకొంది. ఉభయ పార్టీలు ఒకటి రెండు స్థానాలు అటూ ఇటుగా, మాజిక్ ఫిగర్ (35)కు దగ్గరగా ఉన్నాయి. గుజరాత్ లో ఇప్పటికే ఓటమిని అంగీకరించిన కాంగ్రెస్ పార్టీ హిమాచల్ లో మాత్రం బొటాబొటి మెజారిటీతో బయట పడినా ప్రభుత్వం ఏర్పాటుకు ముందునుంచే వ్యూహాలు సిద్దం చేసుకుంటోంది. గతంలో గోవా లో ఎదురైనా అనుభవాలను దృష్టిలో ఉంచుకుని హస్తం గుర్తుపై గెలిచే ఎమ్మెల్యేలను ఆపరేషన్ కమల్ కు చిక్కని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరోవంక ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోయినా మేయర్ పదవి మాదే అని, ధీమా వ్యక్త పరుస్తున్న బీజేపీ హిమాచల్ ప్రదేశ్ లోనూ ఫలితాలు అటూ ఇటూ అయినా ప్రభుత్వం ఏర్పాటుకు పావులు కదుపుతోంది. ‘కమల్ ఆకర్ష్’ ప్రణాళికను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. గెలిచే అవకాశం ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్ధులతో పాటుగా కాంగ్రెస్ అభ్యర్ధులను ‘టచ్’ లోకి తెచ్చుకుందని అంటున్నారు. అత్తెసరు మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుతాన్ని ఏర్పాటు చేసినా, ఆ ప్రభుత్వం అట్టే కాలం ఉండదని, బీజేపీ నాయకులు టీవీ చర్చల్లో బహిరంగంగానే చెపుతున్నారు. ఆ విధంగా ఎంపిక చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది. అందుకే, హస్తం గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా, గురువారం(డిసెంబర్8) సాయంత్రానికే బస్సుల్లో రాజస్థాన్ తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. హిమాచల్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న కాంగ్రెస్ ప్రాధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా ఎమ్మెల్యేల తరలింపు బాధ్యతను ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్, పార్టీ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడాకు అప్పగించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మధ్యాహ్నానికి ప్రియాంక కూడా సీమ్లా చేరుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. హిమాచల్లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 35 మంది సభ్యుల సంఖ్యా బలం అవసరం. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్నాయి. ఇక, ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆశపడిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకూ ఖాతా తెరవకపోవడం గమనార్హం.
http://www.teluguone.com/news/content/camp-politics-in-himachal-before-results-39-148244.html