ఏపీ సర్కార్ దివాలా?
Publish Date:Dec 7, 2022
Advertisement
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దివాలా తీసిందా? అంటే, ప్రభుత వర్గాల నుంచే అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్రం ఇప్పటికే ఇక అప్పులు పుట్టని స్థితికి చేరుకుంది. చివరకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ, ఇతరత్రా పద్దుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసిన నిధులను, పాత బకాయిల కింద వెనక్కి తీసేసుకుందంటే పరిస్టితి ఏమిటో మళ్లీ ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. సుమారు వెయ్యి కోట్ల రూపాయల నిధులను ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అదలా ఉంటే, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సకాలంలో రావడం లేదు. చివరకు పెన్షన్లు కూడా సకాలంలో జమ కావడం లేదు. పెన్షన్ జమ కాగానే, హమ్మయ్యా, ఈ నెలకు పెన్షన్ జమైంది అనే భావన కలుగుతోందని పెన్షనర్లు వాపోతున్నారు. ప్రతి నెలా ఇదే పరిస్థితి ఉందని వారంటున్నారు. అలాగే, ఫస్ట్ తేదీన జమ కావలసిన జీతాలు 15, 20 తేదీల వరకూ కూడా జమ కావడం లేదు. ఏ రోజుకు ఆరోజు గల్లాపెట్టె చూసుకుని, విడతల వారీగా ఉద్యోగుల జీతాలు జమ చేస్తున్నారు. ఈ అన్నిటినీ మించి, చిన్నా చితక కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బిల్లులు, కొండల్లా పేరుకు పేరుకుపోతున్నాయి. ఓ వంక ఉద్యోగులు, జీతాలు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే, కాంట్రాక్టర్లు బిల్లుల కోసం కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దివాలా తీసింది అనేందుకు సంకేతాలే. నిజానికి, జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు, ఆర్థిక వ్యవస్థ తడబడుతూనే ఉంది. తప్పటడుగులు వేస్తూనే వుంది. ఆదాయంతో సంబంధం లేకుండా ‘ఉచిత’ ఖర్చుల పద్దును పెంచుకుంటూ, పట్టాలు తప్పి ప్రయాణం సాగిస్తోంది. ఇప్పుడు పరిస్థితి మరింతగా దిగజారి, చేతులెత్తేసే స్థితికి వచ్చేసిందని, అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా సర్కార్ పనులు చేసిన కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లులు ఎంత కాలానికీ క్లియర్ కాకపోవడంతో రోడ్డెక్కి, ఆందోళనలు చేశారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా, సర్కార్ లో కదలిక లేదు. ఇక చేసేది లేక కోర్టు తలుపులు తట్టారు. క్యూ కట్టి ప్రభుత్వం పై చీటింగ్ పిటిషన్లు వేస్తున్నారు. అది కూడా ఒకరో ఇద్దరో కాదు. ఒకటో రెండో కాదు.. ఏకంగా వందల సంఖ్యలో పిటిషన్లు దాఖలవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. కోర్టులు, అక్షింతలు వేసినా, తక్షణమే బకాయిలు చెల్లించాలని ఆదేశాలు ఆదేశాలు జారీ చేసినా, జగన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం మీద విశ్వాసంతో అప్పులు చేసి పనులు చేసిన కాంట్రాక్టర్లు మరోమార్గం లేక కోర్టు ధిక్కరణ కేసులు వేస్తున్నారు. అయినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు సరికదా, అసలుకే ఎసరు పెట్టే ఆలోచనలు చేస్తునట్లు తెలుస్తోంది. ఆర్బిట్రేషన్కు వెళ్లాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. అంటే కోర్టు వెలుపల మాజీ నాయమూర్తుల ద్వారా వివాదాలను పరిష్కరించునే ప్రయత్నం సర్కార్ చేస్తునట్లు తెలుస్తోంది. ఆర్బిట్రేషన్కు వెళ్ళడం అంటే కాంట్రాక్టర్లను మరో విధంగా మోసం చేయడమే అవుతుందని, అంటున్నారు. అదే జరిగితే, ఒక విధంగా ప్రభుత్వం విశ్వాసం కోల్పోవడమే అవుతుంది. అంతే కాదు, ప్రభుత్వం దివాల తీసిందని, పరోక్షంగానే అయినా ప్రభుత్వమే అంగీకరించినట్లు అవుతుందని అంటున్నారు. అదోకటి అలా ఉంటే, మోసపోయిన వారిలో, కరోనా సమయంలో మానవతా దృక్పథంతో మాస్కులు కుట్టిన మహిళలు, చిన్న చిన్న టైలర్ షాపులు, దర్జీలు, కరోనా రోగులకు భోజనాలు సరఫరా చేసిన హోటల్ యజమానులు, ఇతర చిన్నా చితకా వ్యాపారులు కూడా ఉన్నారు. ఇప్పడు వీరంతా వీధిన పడ్డారు. అప్పులు తీర్చలేక ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకే, ప్రభుత్వ దివాలా కు సాంకేతిక నిర్వచనం ఏదైనా కావచ్చును, కానీ, రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మాత్రం సర్కార్ దివాలాకోరుతనానికి అద్దం పడుతోందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/ap-government-banckrupt-39-148232.html