మద్యం సీసాలతో మరో ఉద్యమం!
Publish Date:Dec 7, 2022
Advertisement
ఒక్క ఐడియా జీవతాన్నే మార్చేస్తుంది. అలాంటిది. పది మంది మహిళలు కలిసి చేసిన అలోచన ఇంకెంత మార్పు తెస్తుందో కదా.. ఒక సమజాన్నే మార్చి వేస్తుంది. బీహార్ లో మహిళల మెదళ్లలో మెదిలిన ఓ అలోచన ఓ కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంది. మధ్యపానం సామాన్య ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా, మద్యం విక్రయాల్లో.. మద్యం మరణాల్లో అగ్ర స్థానంలో నిలిచిన తెలుగు రాష్ట్రలలో అయితే మద్యం మహమ్మారి దుష్ప్రభాల గురించి వేరే చెప్పనే అక్కరలేదు. తెలుగు రాష్ట్రాలలో పట్టణాలలోనే కాదు, గ్రామాలలోనూ మద్యం ఏరులై పారుతోంది. ఇంక ఎన్నికల సమయంలో అయితే చెప్పనే అక్కరలేదు. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల అనతంరం కుప్పలు పోసిన ఖాళీ మద్యం సీసాలు చూసినప్పుడు, నెల రోజుల్లో మునుగోడు ఇంత మద్యం తాగేసిందా? అని జనం ముక్కున వేలేసుకున్నారు. ఇక్కడ మనం ముక్కున వేలేసుకున్నాం కానీ, బీహార్ లో మహిళలు, తాగిపడేసిన ఖాళీ బాటిల్స్ లో ఉపాధి చూసుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో, ప్రభుత్వాలకు మద్యంపై వచ్చే ఆదాయమే మూలాధారం. మద్యం విక్రయాలు లేనిదే ప్రభుత్వాలకు పూట కాదు క్షణం గడవదు. అందుకే అంచెల వారీగా మధ్య నిషేధం విధిస్తామని వాగ్దానం చేసి ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, స్వయంగా మద్యం వ్యాపారం చేస్తోంది.అంతే కాదు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చే బాధ్యతను మద్యపాన ప్రియుల భుజస్కందాలపై ఉంచింది. కానీ బీహార్ లో అలా కాదు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న అతి కొద్ది రాష్ట్రాలలో బీహార్ ఒకటి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2016లో మినహాయింపులు లేకుండా సంపూర్ణ మద్యపాన నిషేధం విధించారు. అయినా మద్యపాన నిషేధం అమలులో ఉన్నా అక్రమ మద్యం మద్యం అమ్మకాలు మాత్రం ఆగలేదు. కల్తీ కల్తీ మద్యం బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలో మద్యం అక్రమ విక్రయాలు, వినియోగానికి వ్యతిరేకంగా మహిళలు, మహిళా సంఘాలు, విపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. అనేక విధాల పోరాటాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పడు కొత్త పంథాను ఎంచుకున్నారు. ఓ రకంగా ఉపాధి పొందుతూ.. ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. అక్రమ మద్యం వ్యాపారులపై దాడులు చేసి పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలతో, చేతి గాజులు, ఇతర అలంకరణ వస్తువులు తయారు చేసి విక్రయించడం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు.మరో వంక మధ్యనిషేధ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. నిజానికి ముందుగా ఈ ఆలోచన ఏ బాధిత మహిళ మెదడులో పురుడు పోసుకుందో ఏమో కానీ ఇప్పడు అదొక ఉద్యమంగా సాగుతోంది. జీవిక స్వయం సహాయక సంఘానికి చెందిన 150 మంది సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జీవిక అనేది ప్రపంచ బ్యాంకు సహాయంతో నడుస్తున్న బీహార్ గ్రామీణ జీవనోపాధి ప్రాజెక్ట్లో ఒక భాగం. దీన్ని గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి సంస్థ అయిన బీహార్ రూరల్ లైవ్లీహుడ్స్ ప్రమోషన్ సొసైటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఏర్పాటు చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఇప్పటి వరకు రెండు టన్నుల మద్యం సీసాలతో 70 వేల చేతి గాజులు తయారు చేశారు. నవంబర్ 26న పాట్నా జిల్లాలోని సబల్పూర్ గ్రామంలో ఈ యూనిట్ను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు. ఈ ప్లాంట్కు రోజుకు 80,000 బ్యాంగిల్స్ను తయారు చేయగల సామర్థ్యం ఉంది. దేశంలోనే చేతి గాజుల తయారీ హబ్గా పేరుగాంచిన ఫిరోజాబాద్కు చెందిన సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో రెండు టన్నుల సామర్థ్యం గల గ్యాస్ ఆధారిత కొలిమి ఉంది. ఈ గ్యాస్ కొలిమిని నిర్వహించడంలో శిక్షణ పొందిన 10 మంది మహిళలు అక్కడ పని చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో కూడా ఇలాంటి అలోచన చేస్తే బాగుటుంది. నిజానికి చేతి గాజుల తయారీలో బీహార్ లో ఫిరోజాబాద్కు ఎంత పేరుందో, మన హైదరాబద్ పాత బస్తీకీ అంత పేరుంది. ఇక ముడి సరుకు, మద్యం సీసాలంటారా? కొదవే లేదు. నిజానికి, రాష్ట్రం మొత్తానికి ఒకటి కాదు, ఉరుకొకటి, వీధి కొకటి ఏర్పాటు చేసినా ముడి సరకు సీసాల కొరత అయితే ఉండదు.. అందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలదే హామీ..
http://www.teluguone.com/news/content/another-monement-with-liquor-bottles-39-148228.html