Read more!

మోడీ మీద ఒబామా వ్యాసం

 

భారత ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మధ్య ఫ్రెండ్‌షిప్ బాగా కుదిరినట్టుంది. అంతర్జాతీయ వేదికల మీద ఒకరినొకరు కలిసినప్పుడు, మోడీ అమెరికా వెళ్ళినప్పుడు, ఒబామా ఇండియాకి వచ్చినప్పుడు వీరిద్దరి మధ్య కనిపించిన స్నేహ సంబంధాలు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా చేశాయి. ఒకప్పుడు మోడీకి వీసా ఇవ్వడానికే అమెరికా నిరాకరించింది. ఇప్పుడు సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడే మోడీకి మంచి స్నేహితుడైపోయాడు. ఈ స్నేహంతోనే ఒబామా మోడీ మీద ఒక వ్యాసం రాశాడు. నరేంద్రమోడీని కీర్తిస్తూ ఒబామా రాసిన ఈ వ్యాసం ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్‌లో ప్రచురితమైంది. టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన వందమంది ప్రభావవంతుల వ్యక్తుల జాబితాలో మోడీకి స్థానం దొరికింది. దాంతోపాటు ‘ఇండియాస్ రిఫార్మర్ ఇన్ ఛీఫ్’ పేరుతో ఒబామా రాసిన వ్యాసాన్ని కూడా ప్రచురించారు. ఇది మోడీకి దక్కిన అరుదైన గౌరవం. పేదరికం నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని ఒబామా తన వ్యాసంలో ప్రసంశించారు. చిన్నతనంలో తన తండ్రికి చాయ్ అమ్మడంలో సహకరించిన బాలుడు నేడు ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడయ్యాడని ఒబామా కొనియాడారు. అలాగే యోగా మీద మోడికి వున్న ఆసక్తిని, మోడీ ప్రవేశపెట్టిన ‘డిజిటల్ ఇండియా’ గురించి కూడా ఒబామా తన వ్యాసంలో ప్రస్తావించారు.