Read more!

నవ వధువుపై హత్యాయత్నం.. ఈ పెద్దలున్నారే..

ప్రేమే నేరమా? పెళ్లే శాపమా? ప్రేమించి, పెళ్లి చేసుకున్న పాపానికి కన్న కూతురినే చంపేస్తారా? తల్లిదండ్రులు ఇక మారరా? వరుస ఘటనలు చూస్తుంటే ఇవే ప్రశ్నలు. తాజాగా, నెల్లూరు జిల్లాలోనూ ఇలాంటి హత్యాయత్నమే జరిగింది. తమను కాదని ప్రేమ వివాహం చేసుకున్నారన్న ఆవేశంతో యువతి కుటుంబ సభ్యులు నవ దంపతులపై దాడి చేశారు. వధువు నోట్లో పురుగుల మందు పోసి చంపే ప్రయత్నం చేశారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ దారుణం కలకలం రేపుతోంది. 

సీతారామపురం మండలం సింగారెడ్డిపల్లికి చెందిన పాణెం బాలకృష్ణ, దేవమ్మ చెరువుకు చెందిన మోడి అనిత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 5న కర్నూలు జిల్లా అహోబిలం ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. తమ కుమార్తెను అపహరించారని యువతి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఆ ప్రేమ జంట సీతారామపురం పోలీసుస్టేషన్‌కు వచ్చారు. తామిద్దరం మేజర్లమని, ఇష్ట పూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని పోలీసులకు చెప్పారు. పోలీసులు ఇరువర్గాల పెద్దలను పిలిపించి ఎమ్మార్వో ముందు హాజరుపరిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు పోలీసులు. కౌన్సిలింగ్ తర్వాత, ఆ ప్రేమ జంట ఆటోలో వరుడి ఇంటికి  బయలుదేరింది. అయితే, యువతి కుటుంబ సభ్యులు, బంధువులు కారులో వారిని వెంబడించారు. మార్గ మధ్యలో ఆటోను అడ్డగించి నవ దంపతులపై దాడి చేశారు. ఆ ఇద్దరిని విచక్షణారహితంగా కొట్టి.. యువతి నోట్లో పురుగుల మందు పోసి హత్యకు ప్రయత్నించారు. సరైన సమయంలో పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ప్రమాదం తప్పింది. తీవ్రంగా గాయపడిన దంపతులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పురుగుల మందు తాగించిన వధువు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు అంటున్నారు. దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. యువతి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నవ దంపతులపై దాడి ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.