టీఆర్ఎస్లో వరంగల్ సభ టెన్షన్.. కేటీఆర్కు బిగ్ టాస్క్..
posted on Oct 18, 2021 @ 2:39PM
నవంబర్ 15న ‘తెలంగాణ విజయగర్జన’ సభ. 10 లక్షల మందితో వరంగల్లో భారీ బహిరంగ సభ. విపక్షాలకు దిమ్మతిరిగేలా సభను సక్సెస్ చేయాలని అధికార పార్టీ పట్టుదలతో ఉంది. రేవంత్రెడ్డి సభలకు ధీటుగా జన సమీకరణ చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఊరికో బస్సు ఏర్పాటు చేసి.. లక్షల్లో ప్రజలను వరంగల్ సభకు తీసుకురావాలని భావిస్తోంది. ఆ మేరకు సభను విజయవంతంగా నిర్వహించేలా పార్టీ శ్రేణులతో కసరత్తు చేస్తున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు తెలంగాణ భవన్లో కేటీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సభ సన్నాహాలపై చర్చించారు. ఉదయం నుంచి నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సభ విజయవంతానికి పార్టీ శ్రేణులన్నీ కదలాలని కేటీఆర్ పిలుపు ఇచ్చారు.
పది లక్షల మందితో సభ నిర్వహించేందుకు అన్ని నియోజకవర్గాల్లో నేతలు క్రియాశీలక పాత్ర పోషించాలని కేటీఆర్ కోరారు. స్థానికంగా సమన్వయ లోపాలు ఉంటే వాటిని పక్కన పెట్టి పనిచేయాలని స్పష్టం చేశారు. మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు నియోజకవర్గ నేతలతో కేటీఆర్ ఇప్పటికే చర్చించారు. ఇవాళ్టి నుంచి రోజూ 20 నియోజక వర్గాల ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. సభ నిర్వహణపై నిర్విరామంగా సమీక్షలు, సమావేశాలు జరపనున్నారు. ఎందుకంటే.. రేవంత్రెడ్డి దూకుడుకు ధీటుగా సమాధానం చెప్పాలంటే.. వరంగల్లో తలపెట్టిన తెలంగాణ విజయగర్జన సభ విజయవంతం అవడం తప్పనిసరి. 10 లక్షల మందికి ఏ ఒక్కరు తగ్గినా.. టీఆర్ఎస్ను తిపక్షాలు చెడుగుడు ఆడుకుంటాయి మరి. అందుకే, అధికార పార్టీలో సభ టెన్షన్ సుస్పష్టంగా కనిపిస్తోంది. బిగ్బాస్ కేసీఆర్ పెద్ద టాస్కే ఇచ్చినా.. చినబాస్ కేటీఆర్ ఆ టాస్క్లో సక్సెస్ అవుతారో లేదో చూడాలి..