Read more!

ఆక‌స్మిక త‌నిఖీల‌తో బాల‌య్య హ‌ల్‌చ‌ల్‌.. హిందూపురంలో ద‌బిడి దిబిడే..

వ‌న్స్ హి స్టెప్ ఇన్‌.. ద‌బిడి దిబిడే. బాల‌య్య బాబునా మ‌జాకా. హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ రాక రాక నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చారు. వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. తొలిరోజు తొడగొట్టి త‌ఢాకా చూపించారు. రాయ‌ల‌సీమ‌కు నీళ్లు, ప్రాజెక్టుల కోసం హ‌ర్యానా త‌ర‌హా ఉద్య‌మానికి సిద్ధ‌మ‌ని హెచ్చ‌రించారు. 

ఇక హిందూపురంలో ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌ రెండోరోజూ ప‌ర్య‌ట‌న మ‌రింత హ‌ల్‌చ‌ల్‌గా సాగుతోంది. క‌రోనా క‌ట్ట‌డిలో జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైన విష‌యం తెలిసిందే. కొవిడ్ స‌మ‌యంలో ప్ర‌భుత్వాసుప‌త్రులు చేతులెత్తేశాయి. స‌రైన వైద్యం, చికిత్స‌, మందులు అంద‌క‌.. అనంత వాసులు బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌లోని ఆసుప‌త్రుల‌కు ప‌రుగులు పెట్టాల్సిన దుస్థితి వ‌చ్చింది. అందుకే, త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌భుత్వాసుప‌త్రి ప‌ని తీరు ప‌రిశీలించ‌డానికి ఎమ్మెల్యే బాల‌కృష్ణ ఆక‌స్మిక త‌నిఖీలు చేశారు.  

హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో అందుతున్న సేవలు, సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావ‌డంతో.. వైద్యసేవలపై బాల‌కృష్ణ తీవ్ర‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. సరైన వైద్యం అందట్లేదని రోగుల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. ఆస్పత్రి పరిస్థితులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ.