అరాచక ప్రభుత్వాన్ని తరిమి కొడతాం.. టీడీపీ స్ట్రాంగ్ వార్నింగ్..
posted on Oct 22, 2021 @ 12:29PM
ఏపీలో అరాచక ప్రభుత్వం నడుస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. సీఎం జగన్రెడ్డి పాలనలో అరాచకత్వం రాజ్యమేలుతోందని విమర్శించారు. పట్టాభి ఇంటిపై వైసీపీ గూండాలు దాడి చేశారు.. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై గంజాయి బ్యాచ్తో దాడి చేయించారు.. ఇలాంటి దాడులకు భయపడబోమన్నారు దేవినేని ఉమా.
జగన్ రెడ్డి గుర్తుంచుకో.. టీడీపీ అధికారంలోకి వస్తుంది. మంత్రులు బరితెగించి బూతులు తిడుతున్నారు. అందరినీ ప్రజాస్వామ్య పద్ధతిలో తరిమి కొడతాం.. అంటూ దేవినేని ఉమా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 11 సీబీఐ, 6 ఈడీ, 18 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్రెడ్డి పరిపాలనలో ఇంతకన్నా ఏమీ ఆశిస్తామన్నారు.
28 వేల ఎకరాల్లో సాగవుతున్న గంజాయి గురించి మాట్లాడితే.. ఆ టాపిక్ను పక్కదారి పట్టించడానికే ఇలా దాడులు కార్యక్రమం చేశారన్నారు. ప్రజలు విద్యుత్ బాదుడుపై కోపంగా ఉన్నారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు వస్తున్నాయి. మనవాడంటూ ప్రజల్ని ఎలా మోసం చేశారో కడపలో ఓ మాజీ మంత్రి చెప్పారు. ఇలా జగన్ గ్రాఫ్ దారుణంగా పతనమవుతుండటంతో ఇలా దారుణాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు.
తప్పు చేసిన అధికారుల లిస్టంతా రాస్తున్నాం. అధికారంలోకి వచ్చాక అందరి సంగతీ తేలుస్తాం. జగన్రెడ్డికి డీజీపీ సాగిల పడ్డారు. 5 సార్లు కోర్టు మెట్లు ఎక్కారు. ప్రజాస్వామ్యానికి దెబ్బ తగిలింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి. అసమర్థ, అవినీతి పాలనపై సీబీఐ విచారణ చేయాలంటూ దేవినేని ఉమ డిమాండ్ చేశారు.