Read more!

సెలబ్రిటీ కపుల్స్ విడిపోవడానికి కారణం ఇదే..

మొన్న అక్కినేని నాగచైతన్య- సమంతా జంట విడాకులు. నిన్న తమిళ్ హీరో ధనుష్ ఆయన భార్య, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య విడాకుల ప్రకటన. నేడు తన ఇన్ స్టామ్ హ్యాండిల్ నుంచి భర్త కళ్యాణ్ దేవ్ పేరు తొలగించిన చిరంజీవి చిన్నకూతురు శ్రీజ. శ్రీజ తన రెండో భర్త నుంచి కూడా దూరమవుతోందంటూ సోషల్ మీడియాలో గుప్పుమంటున్న రూమర్లు. ఇప్పుడు ఒకరి తర్వాత మరొకరు విడిపోతున్న సెలబ్రిటీ జంటలు. ఇప్పుడు మీడియాలో.. సోషల్ మీడియాలో పతాక శీర్షికల్లో దర్శనమిస్తున్న వార్తలు ఇవే. మరో పక్కన విడాకులను సెలబ్రేట్ చేసుకోవాలంటున్నారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

ఈ సందర్భంలోనే తెలంగాణ గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చేసిన వ్యాఖ్య సంచలనంగా మారింది. సెలబ్రిటీ జంటలు కూడా విడిపోతున్నారని ఆమె అన్నారు. ఉమ్మడి కుటుంబాల సంస్కృతి కనుమరుగు అవడమే ఇలాంటి పరిస్థితికి కారణం అని మంత్రి సత్యవతి పేర్కొన్నారు. ప్రతి జంటకూ ప్రభుత్వమో లేదా మహిళా కమిషనో కాపలా ఉండలేదంటూ ఆమె చేసిన కామెంట్ ఇప్పుడు మీడియాలో హల్ చేస్తుండడం గమనార్హం. తెలంగాణ మహిళా కమిషన్ వార్షికోత్సవంలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్ ఈ విధంగా స్పందించారు. మహిళల పట్ల పురుషుల ధోరణిలో మార్పు వస్తే దంపతులు విడిపోయే దుస్థితి రాదనేది ఆమె అభిప్రాయమట. సర్దిచెప్పే పెద్దవారు లేకపోవడం వల్లే దాంపత్య బంధాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయంటారామె. నిరక్షరాస్యులే కాకుండా సెలబ్రిటీ జంటలు కూడా విడిపోతుండడంపై మంత్రి సత్యవతి రాథోడ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.