Read more!

అంధకారం అలుముకుంటున్న భారత్

దేశవ్యాప్తంగా సుమారు డజను రాష్ట్రాల్లో చీకట్లు కమ్ముకొంటున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ తో పాటు పంజాబ్, ఏపీలో ఇప్పటికే రోజూ 8 గంటల పైగా విద్యుత్తు కోతలు అమలవుతున్నాయి. హర్యానా, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు తీవ్ర విద్యుత్తు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే శ్రీలంక, పాకిస్తాన్ లకు పట్టిన దుస్థితే భారతదేశంలోనూ తలెత్తవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో 70 శాతం విద్యుత్తు బొగ్గు ఆధారంగానే ఉత్పత్తి అవుతుంది. అయితే.. థర్మల్ విద్యుత్తు ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అడుగంటిపోతున్నాయి. దీంతో దేశంలో విద్యుత్తు ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ క్రమంలో విద్యుత్తు సరఫరా తగ్గిపోయినట్టు అఖిల భారత విద్యుత్తు ఇంజనీర్ల సమాఖ్య (ఏఐపీఈఎఫ్) ఆందోళన వ్యక్తం చేస్తోంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తాజా నివేదిక ప్రకారం.. 150 థర్మల్ ప్లాంట్లలో 81 చోట్ల బొగ్గు నిల్వల పరిస్థితి దారుణంగా తగ్గిపోయింది. 54 ప్రైవేటు ప్లాంట్లలో 28 చోట్ల బొగ్గు నిల్వల పరిస్థితి కూడా అలాగే ఉంది. మొత్తంగా మరో తొమ్మిది రోజులకు మాత్రమే సరిపడా బొగ్గు నిల్వలు ప్లాంట్లలో ఉన్నట్టు ఏఐపీఈఎఫ్ చైర్మన్ శైలేంద్ర దూబే తెలిపారు. విద్యుదుత్పత్తి కోసం థర్మల్ ప్లాంట్లు 26 రోజులకు సరిపడా బొగ్గును నిల్వ చేసుకుంటాయి. ఈ స్థాయి నిల్వను కనిష్టంగా పరిగణిస్తారు. అయితే ప్రస్తుతం యూపీలోని థర్మల్ ప్లాంట్లలో 7 రోజులు, హర్యానాలో 8 రోజులు, రాజస్థాన్ లోని థర్మల్ ప్లాంట్లలో 17 రోజులకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు ఉన్నాయని  దూబేపేర్కొన్నారు.

వర్షాల కారణంగా గత అక్టోబర్ లో దేశంలోని ప్రధాన బొగ్గు క్షేత్రాల్లోకి వరదనీరు వచ్చిచేరింది. దాంతో బొగ్గును వెలికి తీసే ప్రక్రియకు అంతరాయం కలిగింది. అప్పుడే దేశంలోని ప్రధాన థర్మల్ ప్లాంట్లు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, విమర్శలను తిప్పికొట్టడంపైనే దృష్టి సారించిన కేంద్రం.. పరిష్కార మార్గాల గురించి ఆలోచించలేదు. పైగా విదేశాల నుంచి బొగ్గు దిగుమతులను కూడా తగ్గించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్ 2.5 కోట్ల టన్నుల బొగ్గు మాత్రమే దిగుమతి చేసుకుంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 50 శాతమే. కాగా, ఈ ఏడాది మార్చి నుంచే 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోడు కావడంతో వివిధ రాష్ట్రాల్లో విద్యుత్తు వినియోగం బాగా పెరిగిపోయింది. దీంతో డిమాండ్ కు సరపడినంత విద్యుత్తు సరఫరా ఉండడం లేదు. బొగ్గు నిల్వలు అడుగంటడంతో కొన్ని ప్లాంట్లలో విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. ఫలితంగా పలు రాష్ట్రాల్లో విద్యుత్తు కోతలు పీక్ కు చేరాయి.

బొగ్గు సంక్షోభానికి వ్యాగన్ల కొరత కూడా ఓ కారణమని ఏఐపీఈఎఫ్ చైర్మన్ శైలేంద్ర దూబే పేర్కొన్నారు. ప్లాంట్లకు బొగ్గును రవాణా చేయడానికి 453 రైల్వే రేక్స్ అవసరమని, అయితే కొన్ని రోజుల వరకూ 379 రేక్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం వీటి సంఖ్య 412కు చేరినప్పటికీ, అవి ఎంత మాత్రం సరిపోవన్నారు.

దేశంలో విద్యుత్తు సంక్షోభం తలెత్తనున్నదని పది పన్నెండు రోజులుగా నిపుణులు, నివేదికలు హెచ్చరిస్తున్నప్పటికీ పట్టించుకోని కేంద్రం.. ఆ తర్వాత తీరిగ్గా కొద్ది రోజుల క్రితమే ఓ భేటీ నిర్వహించింది. హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో విద్యుత్తు మంత్రి ఆర్కేసింగ్, బొగ్గు గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ పాల్గొన్నారు. గంట పాటు ఈ భేటీ జరిగినా.. విద్యుత్తు సంక్షోభ నివారణకు చేపట్టే చర్యలపై కేంద్రం ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం.