నోటితో వెక్కిరింపు.. నొసటితో పలకరింపు!

ఏపీలో బీజేపీ విచిత్ర విన్యాసాలు చేస్తోంది. అన్ని విధాలుగా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం అధికార వైసీపీకి అడుగులకు మడుగులొత్తుతూనే.. చార్జిషీట్ల పేరుతో నామ్ కే వాస్తేగా జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తోంది. ఆ మాత్రమైనా చేయకపోతే రాష్ట్రంలో ఉన్న ఒక్క శాతం ఓట్లు కూడా గాయబ్ అవుతాయన్న భయమే అందుకు కారణం. జగన్ సర్కార్ పై ప్రజావ్యతిరేకతను గుర్తించిన బీజేపీ అగ్రనాయకత్వం.. అంటే హస్తినలో ఉన్న కమలం పార్టీ అధిష్ఠానం మీరు జగన్ సర్కార్ ను కనీసం తిట్టినట్లైనా చేయకపోతే ఎలా అని రాష్ట్ర నాయకత్వాన్ని  మందలించడమే   కారణం. అధిష్ఠానం కన్నెర్ర చేయడంతోనే ఇక్కడ వైసీపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నట్లుగా బిల్డప్ ఇవ్వడానికి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలకు జనం నుంచి వీసమెత్తు కూడా స్పందన రాకపోవడంతో వ్రతమూ చెడి.. ఫలమూ దక్కలేదన్నట్లుగా బీజేపీ రాష్ట్ర పార్టీ పరిస్థితి తయారైంది.   ఈ నేపథ్యంలో  ప్రధానమంత్రి నరేంద్రమోదీ 9 ఏళ్ల పాలనపై నెల రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డా రాష్ట్రంలో  పర్యటించనున్నారు. వీరిలో హోంమంత్రి అమిత్ షా ఈ నెల 8న విశాఖపట్నంలో జరిగే బహిరంగ సభలో మోడీ తొమ్మిదేళ్ల  పాలన విజయాలపై ప్రసంగించనున్నారు.   అలాగే పదో తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతిలో   బహిరంగసభలో ప్రసంగిస్తారు. బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణ పై దృష్టి పెట్టినట్లుగా ఏపీని పట్టించుకోవడం లేదు.  వైసీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి చాలు అని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే జనసేనతో పొత్తు కొనసాగించేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఉంటే ఉంటుంది.. లేకుంటే ఊడుతుంది అన్నట్లుగా వ్యవహరిస్తున్నది.  ఈ నేపథ్యంలోనే బీజేపీ  నాయకత్వం జగన్ సర్కార్ విషయంలో తిట్టినట్లు చేస్తూ.. వెనుక నుంచి  సహకారం అందిస్తోంది. 
Publish Date: Jun 3, 2023 4:27PM

బీటలు వారిన మజ్లిస్, బిఆర్ఎస్ సంబంధాలు

తెలంగాణలో అధికార బిఆర్ఎస్  పార్టీకి మిత్ర పక్షాల కంటే శత్రు పక్షాలే ఎక్కువవుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల తర్వాత బిఆర్ఎస్ నుంచి వామ పక్షాలు దూరమయ్యాయి. ఏరు దాటకముందు వీర మల్లన్న , ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టుంది బీఆర్ఎస్ అధ్యక్షుడు కెసీఆర్ వ్యవహారం. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని ఓడించడంలో కీలక పాత్ర పోషించిన  వామ పక్షాలను బిఆర్ఎస్ గెలిచిన తర్వాత  ప్రగతిభవన్ మెట్లు కూడా ఎక్కనియ్యలేదు కెసీఆర్. తొమ్మిదేళ్లు చెట్టపట్టాల్ వేసుకున్న ఎంఐఎంతో  ప్రస్తుతం బిఆర్ఎస్ మధ్య సంబంధాలు  బీటలు వారాయి. ఆదిలాబాద్, సంఘారెడ్డి బహిరంగ సభల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యాదాద్రిని డెవలప్ చేసిన కెసీఆర్ హైద్రాబాద్ లో ఇస్లామిక్ సెంటర్ పెట్టలేకపోతున్నారన్నారు అని ఆరోపించారు.  ముస్లింల శ్రేయస్సు కోసం బిఆర్ఎస్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.  ఎంఐఎం అధినేత తొలిసారి కెసీఆర్ ను బాహాటంగా విమర్శించడం సంచలనం అయ్యింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ  చేస్తున్నప్పటికీ స్వంత రాష్ట్రంలో హైదరాబాద్ పాతబస్తీకే పరిమితమైంది. పాతబస్తీలో మజ్లిస్ పార్టీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్నప్పటికీ తెలంగాణలో ఇతర స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయడానికి ఆసక్తి కనబరిచేది కాదు. ముస్లింలు అత్యధిక జనాభా ఉన్న ప్రాంతాలలో సైతం ఎంఐఎం పోటీ చేసేది కాదు. పైగా బిఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడానికి ఒవైసీ పాటుపడేవారు. ముస్లింల వోట్లు కాంగ్రెస్ కు పడకుండా కేసీఆర్ జాగ్రత్తలు పడేవారు. అందులో భాగంగా కెసీఆర్ మజ్లిస్ సపోర్ట్ తీసుకున్నారు. ముస్లింల వోట్లు బిఆర్ఎస్ కు పడే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు కెసీఆర్.  ఇన్ని రోజులు మజ్లిస్ పార్టీ, బిఆర్ఎస్ మిత్ర పక్షాలుగా ఉండి ప్రస్తుతం శత్రు పక్షాలుగా మారడానికి మజ్లిస్ పార్టీ రహస్య ఎజెండా ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  గతంలో అక్బరుద్దీన్ ఓవైసీ మాత్రమే బిఆర్ఎస్ మీద విరుచుకుపడేవారు. ప్రస్తుతం అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడుతున్నారు. మజ్లిస్ బీఆర్ ఎస్ సంబంధాలు దెబ్బతినకుండా అసదుద్దీన్ ప్యాచప్ చేసేవారు.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పోటీ చేసి 50 స్థానాలు కైవసం చేసుకుంటుందని అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.  మజ్లిస్ ను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా కెసీఆర్ మజ్లిస్ కు ఎంఎల్ సీ సీటు కేటాయించారు.  కొత్త సచివాలయంలో మసీదు కట్టలేదని, షాదీ ముబారక్ అసలైన లబ్ది దారులకు అందడం లేదు వంటి ఆరోపణలు చేశారు అసదుద్దీన్. ముస్లింలు ఉన్న ప్రాంతాల్లో మజ్లిస్ పోటీ చేస్తే ఆ పార్టీ మాత్రమే స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. ఇదే సమీకరణాలు కొనసాగితే బిఆర్ఎస్ ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో స్థానాలు కోల్పోవడం ఖాయం. ప్రస్తుతం బిఆర్ఎస్ కు ఏ ఒక్క పార్టీ కూడా మిత్ర పక్షం లేకపోవడం ఆసక్తికరంగా మారింది. 
Publish Date: Jun 3, 2023 4:04PM

రైలు ప్రయాణం.. ప్రాణం గాల్లో దీపం !

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సొంత రాష్ట్రం ఒడిశాలో పట్టాలపై మరణ మృదంగం మోగింది.రెండు రైళ్లు.. గూడ్స్ రైలు ఢీ కొట్టుకొన్న ఘటనలో దాదాపు 300 మంది ప్రయాణికులు  విగత జీవులయ్యారు. మరో 1000 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడి.. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని.. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హౌరా వెళ్తున్న బెంగళూరు - హౌరా సూపర్‌పాస్ట్ ఎక్స్‌ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పింది. ఫలితంగా ఆ రైలుకు చెందిన పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడిపోవడం.. వాటిని షాలిమార్ - చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఢీ కొట్టడం.. దాంతో ఆ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు బోల్తా పడ్డడం.. ఆ కొద్దిసేపటికే బోల్తాపడ్డ.. కోరమండల్ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై దూసుకొచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టడం.. అంతా క్షణాల్లో జరిగిపోయింది. అయితే మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా.. ఊహించనంతగా పెరిగింది. ఈ ప్రమాదాలన్నీ ఒకదాని వెంట ఒకటి కొన్ని నిమిషాల వ్యవధిలో చోటు చేసుకోవడంతో.. అక్కడ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిలోకి ఇటు స్థానికులు.. అటు ప్రయాణికులు కొన్ని నిమిషాలు పాటు అలా నిశ్చేష్టులై ఉండిపోయినట్లు వెలువడుతోన్న కథనాల ద్వారా అవగతమవుతోంది.   అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆయా రైల్వే స్టేషన్ల వద్ద సిబ్బంది విదుల్లో ఉన్నారా? ఓ వేళ వారు విధుల్లో  ఉండి ఉంటే.. తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నారా? అనే అంశంపై ఆరా తీయాల్సి ఉంది. అంతే కానీ సాక్షాత్తూ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఘటన స్థలానికి చేరుకుని.. ఈ రైలు ప్రమాద కారణాలను ఇప్పటికిప్పుడు అయితే చెప్పలేమని... ప్రమాద ఘటనపై విచారణ చేసి  చెబతామని... ఈ ఘటనపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీ  ఏర్పాటు చేశామంటూ  చేతులు దులిపేసుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు నష్ట పరిహరం అందజేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.    అయితే కొన్ని దశాబ్దాల క్రితం రైల్వే శాఖ మంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో దేశంలో ఏక్కడో రైలు ప్రమాదం జరిగితే.. అందుకు ఆయన నైతిక బాధ్యత వహిస్తూ... మంత్రి పదవికి రాజీనామా చేశారు. కానీ నేటి రాజకీయ నాయకుల్లో ఆ నీతి.. ఆ నిజాయితీ.. ఆ నైతిక బాధ్యత.. నిబద్దత అనేవి ఎక్కడా దుర్భిణి వేసి వెతికినా.. కానరాని పరిస్థితి అయితే నెలకొందనేది మాత్రం సుస్పష్టం. పోనీ ఈ ప్రమాద ఘటనపై స్థానిక రైల్వే స్టేషన్ సిబ్బందిని రైల్వే మంత్రి ఆరా తీసినా.. ప్రమాద ఘటన వివరాలు వెంటనే వెల్లడించవచ్చు. కానీ సదరు మంత్రిగారికి ఆ ఆలోచన, ఉద్దేశం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా భారతీయ రైల్వే.. ఆదాయం కోసం చేసే వేసే ట్రిక్కులకు ట్రాక్ రికార్డు గట్టిగానే ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రయాణికుల అవసరాన్ని.. అత్యవసరాన్ని క్యాష్.. ఎన్ క్యాష్ చేసుకోవడం కోసం.. రైలు టికెట్ ధరలు పెంచు కోవడమే కాదు.. తత్కాల్, ప్రీమియం తత్కాల్ వంటి వాటిని తెరపైకి తీసుకు వచ్చి.. ప్రయాణికులను నిలువు దోపిడి చేయడంలో దేశంలోని అన్ని రైల్వే జోన్లు పోటా పోటీగా   అగ్రస్థానంలో నిలిచేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఒలింపిక్స్ మెడల్.. మెడలో వేయాల్సిందేనని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇక పండగలు, వరుస సెలవుల దృష్ట్యా రైల్వే స్టేషన్లకు పిల్లాపాపలతో ప్రయాణికులు పోటెత్తుతుంటారు. అలాంటి వేళ.. రైల్వే స్టేషన్‌లో ప్లాట్ ఫామ్ టికెట్ల ధరలు 10 రూపాయిలు  నుంచి  ఏకంగా 50 రూపాయిలకు పెంచేసిన ఘనత మన రైల్వే శాఖది. అంతేందుకు రైల్వే స్టేషన్ల వద్ద, రైల్వే రిజర్వేషన్ల కౌంటర్ల వద్ద.. వాహనాల పార్కింగ్ ఫీజు సైతం.. అదీ కూడా జీఎస్టీ వడ్డనతో సహా లెక్క కట్టి మరీ వసూల్ చేసి.. వసూల్ రాజాగా రైల్వే శాఖ ఖ్యాతి గాంచింది. అంతే కాదు.. ఓ సాధారణ మధ్యతరగతి ప్రయాణికుడు.. తన కుటుంబంతో కలిసి రైల్వే స్టేషన్‌కు వచ్చి.. రైలులో సాదారణ బోగి ఎక్కి.. ప్రయాణించడం.. ఓ మహా ప్రహనంగా మారిపోయింది. ఇక ఓ ప్రయాణికుడు.. అత్యవసర సమయంలో రైల్వే సమాచారం కోసం రైల్వే స్టేషన్‌కి ఫోన్ చేయాలంటే.. నెంబర్ ఉండదు. అలాగే టోల్ ప్రీ నెంబర్లు కానీ కాన రానీ దుస్థితి నెలకొంది.  రైల్వే స్టేషన్ల అభివృద్దికి కోట్లది రూపాయిలు వెచ్చించే ఈ ప్రభుత్వాలు.. రిజర్వేషన్ల కౌంటర్ల వద్ద మరింత మంది సిబ్బందిని నియమించే విషయంలో మాత్రం అపరిచితుడిలాగా వ్యవహరిస్తోంది. అలాగే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిత్యం.. దేశవ్యాప్తంగా రైళ్లు అటు ఇటు వెళ్తుంటాయి. అలాంటి వేళ.. ప్రతి రైలుకు అటు రెండు...  ఇటు రెండు సాధారణ భోగిలు కాకుండా.. దాదాపు ఆరు నుంచి ఏడు సాధారణ ప్రయాణికుల కోసం బోగీలను ఏర్పాటు చేస్తే.. అత్యవసర ప్రయాణాల్లో ప్రయాణించాల్సిన ప్రయాణికులు సైతం ఎంతొ కొంత ఊరట చెందుతారు. అయితే ఆ దిశగా చర్యలు కాదు కనీసం ఆలోచన కూడా రైల్వే శాఖ చేయడం లేదు.  అంతే కాదు వందే బారత్.. వంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌ల కంటే.. దూర ప్రాంతలకు వెళ్లే రైళ్లకు సాధారణ బోగీల సంఖ్య మరింత పెంచాల్సిన అవసరం.. అవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే సదరు సాధారణ బోగీల్లో.. కొన్ని గంటల పాటు సాగిస్తున్న సామాన్య ప్రయాణికుడు.. నిత్య నరకాన్ని ప్రతి ప్రయాణంలో చవి చూస్తున్నాడనేది ఎవరు కాదన లేని వాస్తవం.
Publish Date: Jun 3, 2023 3:36PM

రైలు ప్రమాద బాధితుల కోసం స్వచ్ఛందంగా రక్తదానం

ఒక విపత్తు సంభవించినపుడు, ఒక మహా విషాదం జరిగినప్పుడు జనం స్వచ్ఛందంగా సహాయ హస్తం అందించేందుకు ముందుకు రావడం భారత్ డీఎన్ ఏలోనే ఉంది. దివిసీమ ఉప్పెన, కోనసీమ ఉప్పెన వంటి సంఘటనలు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవడానికి యావద్దేశం ముందుకు వచ్చింది. అలాగే  ఒడిశా రైలు ప్రమాద ఘటనలో 300 మందికి పైగా మరణించి, వెయ్యి మందికి పైగా గాయపడిన సందర్భంలో  క్షతగాత్రులకు రక్త దానం చేయడానికి జనం ఆస్పత్రుల ముందు క్యూ కడుతున్నారు.  ఆస్పత్రులలో చేరిన క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటమే కాకుండా వారికి అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఉండటంతో  రక్త దానం చేయడానికి బాలాసోర్ ఆస్పత్రికి వేల సంఖ్యలో జనం తరలి వచ్చారు. బాధితులకు ఆదుకోవడానికి తమ వంతు సాయంగా రక్తదానం చేయడానికి వాళ్లంతా స్వచ్ఛందంగా వచ్చారు. అలాగే ఘటనా స్థలం వద్ద స్థానికులు యుద్ధ పాత్రిపదికన జరుగుతున్న సహాయ కార్యక్రమాలలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.   బోగీలలో చిక్కుకున్న వారిని బయటకు తీయడంలోనూ, గాయపడిన వారిని అంబులెన్సులలోకి చేర్చడంలోనూ సహాయక బృందాలకు సహాయం అందిస్తున్నారు.  రైలు ప్రమాదం జరిగిన శుక్రవారం రాత్రి నుంచి జనం ఎడతెరిపి లేకుండా వారి వంతు సహాయం వారు అందిస్తున్నారు. 
Publish Date: Jun 3, 2023 3:30PM

జవాబుదారీ తనం ఏదీ ఎక్కడ?

ఒడిశాలో మూడు రెైళ్లు ఢీకొన్న ఘటనలో  దగ్గరదగ్గర మూడు వంద ల మంది మరణించారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగి గంటలు గడిచినా ఇంకా సహాయక కార్యక్రమాలు పూర్తికాలేదు. బోగీల్లో ఎంత మంది చిక్కుకుని ఉన్నారన్న దానిపై స్పష్టత రాలేదు. రైల్వే మంత్రి, ఒడిశా ముఖ్యమంత్రి, తమిళనాడు నుంచి ముగ్గురు మంత్రులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. మృతుల కుంటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అయితే  రైలు ప్రమాదాల నివారణకు అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో, దానిని వినియోగించుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనడానికి ఒడిశా రైలు ప్రమాద ఘటన నిలువెత్తు నిదర్శనమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వంలో, సంబంధిత మంత్రిలో జవాబుదారీ తనం ఎక్కడుందన్న ప్రశ్నలు ఎదురౌతున్నాయి. ఒడిశా ప్రమాద ఘటనే తెలుసుకుంటే ఈ ప్రమాదం వెనుక కనిపిస్తున్నది నిర్లక్ష్యమేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి. రైలు ప్రమాదాలను అరికట్టేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలను వినియోగంలోకి తీసుకురావడంలో  అలవిమాలిన నిర్లక్ష్యం చూపుతున్న కేంద్రం.. విపక్ష నేతల కదలికలపై నిఘా కోసం కోట్లాది రూపాయలు వ్యయం చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఒడిశా రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్వినివైష్ణవ్ రాజీనామా చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.   గతంలో రైలు ప్రమాద ఘటనలు జరిగినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన రైల్వే మంత్రుల ఉదంతాలను ఈ సందర్భంగా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. 1956 నవంబర్ లో తమిళనాడులోని అరియాలూర్ లో రైలు ప్రమాదం జరిగి 142 మంది మరణించారనీ, ఆ సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి తన మంత్రి పదవికి రాజానామా చేశారు.  అంతకు ముందు 1956  ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ లోని మహబూబ్ నగర్ వద్ద రైలు ప్రమాదం సంభవించి 112 మంది మరణించిన సందర్భంలో కూడా రైల్వే మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. అయితే ప్రధాని నెహ్రూ అయన రాజీనామాను ఆమోదించలేదు. ప్రధాని గట్టిగా చెప్పడంతో అప్పటికి ఊరుకున్న లాల్ బహదూర్ శాస్త్రి అదే ఏడాది నవంబర్ లో  మరో రైలు ప్రమాదం జరగడంతో నెహ్రూకు తిరస్కరించే అవకాశం లేకుండా మంత్రి పదవికి రాజీనామా చేసి ఆమోదించి తీరాల్సిందే అని పట్టుబట్టి మరీ పదవి నుంచి వైదొలగారు. ఇక 1999 ఆగస్టలో అసోంలో జరిగిన రైలు ప్రమాదంలో 290 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి నితీష్ కుమార్ సైతం తన పదవికి రాజీనామా చేశారు.  ఆ తురువాత కూడా 2000 సంవత్సరంలో జరిగిన రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ చేసిన రాజీనామాను అప్పటి ప్రధాని వాజ్ పేయి ఆమోదించలేదు. అలాగే 2106లో పాట్నా సమీపంలో రైలు ప్రమాదం జరిగి 150 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు చేసిన రాజీనామాను ప్రధాని మోడీ ఆమోదించలేదు. అయితే తాజాగా ఆధునిక సాంకేతిక అందుబాటులోకి వచ్చినా దానిని వినియోగించుకోవడంలో విఫలం కావడం వల్ల జరిగిన ఈ ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్వినివైష్ణవ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ను కనీసం ఆయన పరిగణనలోనికి తీసుకోకపోవడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.   మోడీ సర్కార్ లో మంత్రులలో జవాబుదారీ తనం కనిపించడం లేదన్న విమర్శలు చాలా కాలంగా వినవస్తున్న సంగతి తెలిసిందే.   
Publish Date: Jun 3, 2023 3:12PM

 దేశ ప్రతిష్ట తీసిన రాహుల్ 

అమెరికాలో మన ప్రధాని నరేంద్ర మోడీపై వ్యక్తిగత విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వల్ల దేశ పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. విదేశీ గడ్డపై ఇండియా సమస్యలు, పరిష్కారాల మీద మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి లాభించేది. మోడీ పాలన గురించి విమర్శిస్తే పర్వాలేదు వ్యక్తిగతంగా దూషించడం భారత్ ను చులకన చేసినట్టయ్యింది ఎందుకంటే మోడీ చరిష్మా ఉన్న నేత. ప్రపంచంలో అత్యంత శక్తివంత ప్రధానులలో ఆయన ఒకరు. అటువంటి నేత మీదే రాహుల్ బాణాలు సంధించడం నెగెటివ్ మీనింగ్  వెళుతుంది. భార్యభర్తలు కొట్లాడుకుంటే ఆ గొడవ ఇంట్లో మటుకే పరిమితం చేస్తే బాగుంటుంది. నలుగురికి తెలిస్తే పరువుపోతుంది. మన దేశ జాతీయత భావం మోడీ హాయంలో విపరీతంగా పెరిగింది . ఈ సమయంలో  మోడీ మీద రాహుల్ విమర్శ చేయడం వల్ల కాంగ్రెస్ పరువు బజారున పడింది.  మరికొద్ది రోజుల్లో మన ప్రధాని మోడీ అమెరికా వెళ్లనున్నారు. ఆయన పర్యటనకు ముందే రాహుల్ అమెరికా చేరుకుని మోడీని విమర్శించడం రాంగ్ మెసేజ్ వెళుతుందన్న అభిప్రాయం వ్యక్తమయ్యింది.  ‘‘ప్రధానికి అన్ని తెలుసు అనుకుంటాడు. దేవుని కంటే తాను ఎక్కువ అనుకుంటాడు. దేవుడికే హిత బోధ చేయగలనని’’ భావిస్తాడు అని  మోడీని చులకన చేసి మాట్లాడటం మన ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఉంది. ‘‘ నఫ్రత్ కే బజార్ మే మొహబ్బత్ కే దుకాణ్ కోలింగే హమ్ ’’ అంటూ ఫక్తు రాజకీయాలే మాట్లాడటం వల్ల కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ప్రయోజనం చేకూరే అవకాశం లేదు. 
Publish Date: Jun 3, 2023 2:03PM