రాజారెడ్డిని చంపిన వాళ్ల‌ను...టీడీపీ ఆఫీసులో దాచి పెట్టారా?

posted on: May 22, 2026 11:25AM

 

వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ  తెర‌పైకి. అస‌లీ కేసులో ఏం జ‌రిగింది? జ‌గ‌న్ చెప్పిన‌ట్టు ఇది కూడా ఆయ‌న దృష్టిలో  చంద్ర‌బాబు చేయించిన హ‌త్యేనా? ఈ కేసు ప్ర‌స్తుతం ఏ ద‌శ‌లో ఉంది? ఆ నాడు ఈ కేసులోని వారు ఇప్పుడు ఏమంటున్నారు? ఏమిటా వివ‌రాలు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  రాజారెడ్డి హత్య కేసు  దశాబ్దాల నాటిదైనా, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ అంశం మళ్లీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు నేపథ్యం, జగన్ ఆరోపణలు, నిందితుల స్పందన, ప్రస్తుత స్థితికి అద్దం ప‌డుతోంది.
 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి, వైఎస్ జగన్ రెడ్డి తాత- వైఎస్ రాజారెడ్డి 1998 మే 23న కడప జిల్లా వేముల సమీపంలో బాంబు దాడిలో హత్యకు గురయ్యారు. పులివెందుల ప్రాంతంలో అప్పట్లో ఉన్న ఫ్యాక్షన్ రాజకీయాల కార‌ణంగా ఈ ఘోరం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా ప్రాంతీయ విభేదాలు, గనుల వ్యాపార వివాదాలు.. కీల‌కంగా ఉన్నాయని అప్పట్లో నిర్ధారించారు పోలీసులు.

జగన్ చెప్పినట్లు చంద్రబాబే చేయించారా? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం వెతికితే..  ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వైఎస్ జగన్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. 1999 ఎన్నికలకు ఏడాది ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తన తాత రాజారెడ్డిని దారుణంగా చంపారని ఆరోపించారు జగన్. వైఎస్సార్‌ను పులివెందులకే పరిమితం చేయాలనే రాజకీయ కుట్రతోనే టీడీపీ ఈ హత్య చేయించిందని, హత్య చేసిన త‌ర్వాత‌ నిందితులను హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో దాచిపెట్టి అధికార బలంతో రక్షించారని ప్రస్తావించారు జగన్.

తెలుగుదేశం పార్టీ ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. రాజారెడ్డి హత్య పూర్తిగా కడప జిల్లాలోని స్థానిక ఫ్యాక్షన్, గనుల వివాదాల వల్ల జరిగిందని, దానికి పార్టీకి లేదా చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తోంది.

న్యాయపరంగా చూస్తే ఈ కేసు ఎప్పుడో ముగిసిపోయింది. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు, నిందితులకు శిక్షలు కూడా విధించింది. రాజారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నవారికి కోర్టులు జీవిత ఖైదు శిక్ష విధించాయి. శిక్షా కాలం పూర్తి చేసుకుని,  చట్టపరమైన నిబంధనల ప్రకారం నిందితులు ఇప్పటికే జైలు నుంచి విడుదలయ్యారు. చట్టపరంగా ఈ కేసు ముగిసినప్పటికీ, రాజకీయంగా మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి దీన్ని వాడుకుంటున్నారు.

ఆ నాడు ఈ కేసులో నిందితులుగా  ఉన్న‌ వారు ఇప్పుడు ఏమంటున్నారు? అని గ‌మ‌నిస్తే.. జగన్ వ్యాఖ్యలపై ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి, శిక్ష అనుభవించి విడుదలైన పార్థసారథిరెడ్డి కడపలో మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు.  జగన్ చేసిన ఆరోపణలను పార్థసారథిరెడ్డి పూర్తిగా తిప్పికొట్టారు.  నీ తాత రాజారెడ్డి  మనుషులు నన్ను ఎలా నరికారో, అలాగే నా వర్గీయులు మీ తాతను నరికారు. 

అది ఫ్యాక్షన్ గొడవ  అంటూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. తాను ఎంతో మంచి వాడిన‌ని చెప్పుకుంటున్న జ‌గ‌న్ ఒక న‌ర‌రూప రాక్ష‌సుడ‌ని.. తాత‌కు త‌గ్గ మ‌న‌వ‌డ‌ని వ్యాఖ్యానించారాయ‌న‌.గతంలో వైఎస్సార్‌ కుటుంబం తన అంగబలాన్ని, ఆర్థిక బలాన్ని దెబ్బతీసి ఎన్నో చిత్ర‌ హింసలకు గురిచేసిందని, మంగలి కృష్ణ అనే వ్యక్తితో కలిసి.. తనపై సూట్‌కేస్ బాంబు దాడి చేయించి చంపాలని చూశారని ఆరోపించారు పార్థసారథిరెడ్డి.

తమపై కక్ష సాధింపు చర్యలు జరిగాయని, తాము ఎన్నో పోరాటాలు చేసి నిలబడ్డామని, జగన్ తమకు ఎలాంటి ప్రాణభిక్ష పెట్టలేదని ఆయన మండిపడ్డారు.రాజారెడ్డి హత్య అనేది 1998లో జరిగిన ఒక ఫ్యాక్షన్ ఉదంతం. న్యాయస్థానాలు దీనిపై తీర్పునిచ్చి ఎప్పుడో కేసు క్లోజ్ అయినప్పటికీ, ఏపీలో వైసీపీ-టీడీపీ మధ్య నడుస్తున్న  హత్యా రాజకీయాల  సవాల్-ప్రతిసవాళ్లలో భాగంగా ఈ పాత కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. అంతే  కాదు గొడ్డ‌లి  పార్టీ అంటూ చంద్ర‌బాబు జ‌గ‌న్ పార్టీని అన‌డంతో అస‌లీ గొడ‌వంతా  మొద‌లైంది. ఎవ‌రిది క్రిమిన‌ల్ బ్రైన్? అంటూ జ‌గ‌న్ పాత కాల‌పు కేసుల‌న్నిటినీ  తిర‌గ‌దోడారు. అందులో భాగంగా ఇదంతా మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...