ఎమ్మెల్యేనా.. బజారు రౌడీనా! లోకేష్ కథ చూస్తానని వార్నింగ్.. 

కర్నూల్ జిల్లా పాణ్యం నియోజకవర్గంలో జరిగిన జంట హత్యలు దుమారం రేపుతున్నాయి. ఫ్యాక్షన్ హత్యలు జరగడంతో జిల్లా వాసులు ఉలిక్కి పడుతున్నారు.  టీడీపీ నేతలు దారుణ హత్యల వెనుక పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారంటూ టీడీపీ నేత నారా లోకేశ్ తో పాటు పలువురు నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో నారా  లోకేశ్ పై ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. లోకేశ్ నోరు అదుపులో పెట్టుకోవాలని... లేకపోతే ఆయన కథ చూస్తామని హెచ్చరించారు. రెచ్చగొట్టేలా లోకేశ్ మాట్లాడుతున్నారని అన్నారు.

వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేశ్... ఒక జోకర్ వంటి వాడని కాటసాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని అన్నారు. తిట్టాలనుకుంటే తాము కూడా తిట్టగలమని... కాకపోతే ఆ సంస్కృతి తమకు లేదని చెప్పారు. లోకేశ్ ట్విట్టర్లో తప్ప ప్రజల ముందుకు వచ్చి మాట్లాడలేడని అన్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం తమకు లేదని కాటసాని అన్నారు. లోకేశ్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడని... వైయస్సార్ కొడుకుగా జగన్ ఎలా మాట్లాడుతున్నారో చూసి లోకేశ్ నేర్చుకోవాలని హితవు పలికారు. పులికి పులి బిడ్డ పుట్టిందని... నక్కకు నక్క బిడ్డ పుట్టిందని ఎద్దేవా చేశారు. 

నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేగా ఉంటూ బజారు రౌడీలా మాట్లాడుతున్నారని జనాలు ఫైరవుతున్నారు. ఓపెన్ గానే కథ చూస్తానంటూ బెదిరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఫ్యాక్షన్ హత్యల వెనుక ఎమ్మెల్యే హస్తం ఉంది కాబట్టే.. ఆయన బరి తెగించి వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. హత్యలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.