వైసీపీ ఎంపీ రౌడీషీటర్లు, భూకబ్జాదారుల లీడర్.. వైసీపీ ఎమ్మెల్యే సంచలనం..
posted on Sep 20, 2021 4:21PM
ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టిందా? పార్టీలో నేతల మధ్య అంతర్గత పోరాటం ముదిరిపోయిందా? త్వరలోనే వైసీపీలో సంచలనాలు జరగబోతున్నాయా? అంటే వైసీపీలో తాజాగా జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. సొంత పార్టీ నేతలపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రోడ్డెక్కుతున్నారు. తమ అక్రమాలు, అరాచకాలను బయటపెట్టుకుంటున్నారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలను వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు చేసుకోవడం కలకలం రేపుతోంది.
తాజాగా రాజమండ్రి వైసీపీలో కోల్డ్ వార్ భగ్గుమంది. ఎంపీ భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య కొంత కాలంగా అంతర్గతంగా సాగుతున్న వివాదం బహిర్గతమైంది. ఎంపీ భరత్పై ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో వైసీపీని ఎంపీ భరత్ సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో భరత్ కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ను ఇబ్బందిపెట్టిన మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణతో కలిసి భరత్ సెల్ఫీలు తీసుకున్నారని ఆరోపించారు.
ఎంపీ భరత్ వెనుక రౌడీషీటర్లు, భూకబ్జాదారులు ఉన్నారని ఆరోపించారు జక్కంపూడి రాజా. భరత్ చిల్లర పనులు మానుకోవాలని జక్కంపూడి హెచ్చరించారు. భరత్ రాజానగరంలో దళితులు, గిరిజనులు, బీసీలను రెచ్చగొడుతున్నారని, భరత్ తనపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి.. తూచ్ అంటున్నారని జక్కంపూడి రాజా మండిపడ్డారు. వైసీపీ ఎంపీపై వైసీపీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా రౌడీ షీటర్లు, భూకబ్జాదారులకు ఎంపీ వంత పాడుతున్నారన్న రాజా వ్యాఖ్యలపై సంచలనంగా మారాయి.