ధింసా నృత్యంతో ప్రధానికి స్వాగతం.!

posted on: Jul 25, 2026 11:38AM

ఉత్తరాంధ్రకే తలమానికంగా రూపుదిద్దుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్రమోడీ వచ్చే నెల1న  జాతికి అంకితం చేస్తున్న నేపథ్యంలో ఈ ఎయిర్ పోర్టు  ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్ అనే రీతిలో విజయవంతం చేయాలని ఏపీ మంత్రి నారా లోకేష్ ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను  శుక్రవారం(జులై 24) స్వయంగా  పరిశీలించిన మంత్రి లోకేష్..  అనంత‌రం స‌మీక్ష నిర్వ‌హించారు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి మూడు లక్షల మందికి పైగా ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం, ప్రధాని మోదీ బహిరంగసభకు హాజరవుతారనీ, అందుకు తగ్గట్లుగా  ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాలని లోకేష్ ఆదేశించారు.  కూటమి నాయకులు సమన్వయంతో పనిచేసి ప్ర‌ధాని స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు. 

ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతూ  13వేలమందితో దేశంలోనే అతిపెద్ద ధింసా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవ సభకు హాజరయ్యే ప్రజలకోసం 36 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 5వేల బస్సులు ఏర్పాటు చేశారు.

సభకు వచ్చేవారు బస్సు ఎక్కినప్పటినుంచి తిరిగి వెళ్లేవరకు ఎటువంటి లోటులేకుండా మండలస్థాయి లైజన్ ఆఫీసర్లు దగ్గరుండి చూసుకోవాలని లోకేష్ చెప్పారు.    ప్ర‌ధాని బహిరంగసభను వీక్షించేందుకు ప్రతి 5వేలమందికి ఒక ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవ ఏర్పాట్ల కమిటీ  ముఖ్య అధికారి ఎంటి కృష్ణబాబు చెప్పారు. సీనియర్ ఐఎఎస్ అధికారులు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారన్నారు. 

ఈ సమీక్షలో  మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్,  తెలుగుదేశం జాతీయ ప్రధానకార్యదర్శి కిలారి రాజేష్, ఎపిఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, ఎంపి చింతకాయల విజయ్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, కార్యక్రమాల కమిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, కళా వెంకట్రావు, కోండ్రు మురళీమోహన్, లోకం నాగమాధవి , విఎంఆర్ డిఎ చైర్మన్ ప్రణవ్ గోపాల్, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శి జి.వీరపాండ్యన్, విజయనగరం కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ ఎండి ఢిల్లీరావు, మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చైర్మన్ ఎంఎం నాయక్,  ఎపి గిరిజన కార్పొరేషన్ ఎండి ఎస్ఎస్ శోభిక, విశాఖపట్నం రేంజి ఐజి గోపినాథ్ జెట్టి, రవాణాశాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా,  విజయనగరం ఎస్పీ దామోదర్, ఎపి ట్రైబల్ వెల్ఫేర్ డైరక్టర్ భార్గవి,ప్రోటోకాల్ (జిఎడి) డైరక్టర్ మోహన్ రావు, విజయనగరం జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్, విజయనగరం డిసిసిబి చైర్మన్ కిమిడి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Welcome to Prime Minister,  Dhimsa dance, Bhogapuram, Airport, Inaguration, Minister, Lokesh

google-ad-img
    Related Sigment News
    • Loading...