కాంగ్రెస్ కలను వెంకయ్య నాయుడు సాకారం చేస్తారా?

 

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి మోడీ వచ్చే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్ధి అంటూ మీడియాలో వార్తలు వస్తున్ననేపద్యంలో, మొన్నఆయన కొత్తగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రాజ్ నాథ్ సింగ్ ను కలవడానికి డిల్లీ రావడం ప్రాదాన్యతని సంతరించుకొంది. మూడు నాలుగు గంటలకు పైగా సాగిన వారి సమావేశం అనంతరం, పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అయన అభ్యర్దిత్వం గురించి ప్రత్యేకంగా ఏమి మాట్లాడకపోయినప్పటికీ, మీడియాతో మోడీకు అనుకూలంగానే మాట్లాడారు.

 

ఆ మరునాడే, ఆ పార్టీకే చెందిన సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కూడా మోడీ అభ్యర్దిత్వాన్ని సమర్దిస్తూ మాట్లాడారు. తరువాత, బీజీపీ నుండి సస్పెండ్ చేయబడ్డ రామ్ జేత్మలానీ కూడా మోడీ లౌకికవాది, అతని నాయకత్వంలోనే పార్టీ ఎన్నికలను ఎదుర్కోవడం మంచిదని అన్నారు.

 

అయితే, పార్టీ ఇంతవరకు మోడీ అభ్యర్దిత్వాన్నిఖరారు చేయనప్పటికీ, అప్పుడే ఆయనకు వ్యతిరేఖంగా మరోవర్గం ప్రచారం మొదలు పెట్టింది. పార్టీలో సీనియర్ నాయకుడు వెంకయ్య నాయడు నిన్న మీడియా వారితో మాట్లాడుతూ “అద్వాని, నేను, సుష్మ స్వరాజ్ తో సహా పార్టీలో చాలామందే ప్రధాని పదవికి అర్హులయినవారున్నారు. కానీ, ఈ విషయం గురించి పార్టీలో చర్చించి తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకొంటాము,” అని అన్నారు.

 

భారతీయ జనతాపార్టీ ఉన్న ప్రస్తుత పరిస్థితులలో, ఆ పార్టీని వచ్చేఎన్నికలలో నరేంద్ర మోడీ తప్ప మరొకరు గట్టేకించలేరు అని వారికీ తెలిసినప్పటికీ కూడా కాంగ్రెస్ ను అవలీలగా ఓడించి డిల్లీ పీటాన్ని కైవసం చేసుకోగలమని వారు నమ్ముతున్నారు.

 

కానీ, కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలను రాహుల్ గాంధీ నేతృత్వంలో, అతనిని తమ పార్టీ ప్రధాని అభ్యర్ధిగా నిలిపి ముందుకు సాగాలనుకొంటునందున ఆ పార్టీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొనిపనిచేస్తుంది. అటువంటప్పుడు, దేశ వ్యాప్తంగా మంచి పేరు పొంది, రాహుల్ గాంధీని దీటుగా ఎదుర్కోగల నరేంద్ర మోడీని కాదనుకొని, ఏంతోకాలంగా ప్రధాన పదవిని అధిష్టించాలని ఆశపెట్టుకొన్న వయసుమీరిన లాల్ కృష్ణ అద్వానీ, లేదా ఏవిధమయిన ప్రత్యేకత లేని వెంకయ్య నాయుడు, సుష్మ స్వరాజ్ వంటి నేతలను ముందుంచుకొని భారతీయ జనతా పార్టీ గనుక ఎన్నికలకు వెళితే ఫలితాలు ఎలా ఉంటాయో వేరేగా చెప్పనవసరం లేదు.

 

నిజం చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీ కూడా మోడీ కాకుండా వేరేవరయినా ఆ పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తే తనకీ లాభం అని కోరుకొంటోంది. కాంగ్రెస్ కోరికని వెంకయ్య నాయుడు వంటి వారు సాకారం చేస్తారేమో చూడాలి మరి.