విపక్షాల ఐక్యతకు ఆయనే అవరోధమా? 

కాంగ్రెస్ పార్టీ లేకుండా జాతీయ స్థాయిలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఎని దీటుగా ఎదుర్కునే ప్రత్యాన్మాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేయడం అయ్యే పని కాదు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. అందుకే, కాంగ్రెస్ సారధ్యంలో లేదా కాంగ్రెస్ తో కలిసి బీజీపీయేతర పార్టీల కూటమి ఏర్పాటుకు అయన కొంత ప్రయత్నం చేశారు. అయితే, ఆతర్వాత ఏమైందో ఏమో కానీ, పీకే ఇంకేదో పనిలో పడిపోయారు. ఎక్కడ కనిపించడం లేదు. వినిపించడం లేదు. నిజానికి, ఇది పీకేనో మరొకరో చెపితేనేగాని, తెలియని రహస్యం ఏమీ కాదు.కాంగ్రెస్ సహా  అన్ని పార్టీలకు ఈ విషయంలో స్పష్టత ఉంది. 

అదే సమయంలో  ప్రతిపక్షాల ఉమ్మడి వ్యూహానికి కాంగ్రెస్ పార్టీనే ప్రధాన ప్రతిబంధకం అనే అభిప్రాయం కూడా ఇప్పుడ డిప్పుడు బయటకు వస్తోంది. కొద్ది రోజుల క్రితం ఎన్సీపీ అధినేత శరద్  పవార్ పరోక్షంగానే అయినా, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అనే కాంగ్రెస్ పార్టీ  ఆలోచనను తప్పు పట్టారు. భూ పరిమితి చట్టం వచ్చి భూములు కోల్పోయిన జమీందారులు, హవేలీలలో  పూట గవడమే కష్టంగా ఉన్నా తాము ఇంకా మునుపటి జమీందారులమే అనే భ్రమల్లో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ కూడా వర్తమానంలో కంటే గతంలో జీవిస్తోందని చురకలాంటించారు. ఒక విధంగా అయన కాంగ్రెస్ పార్టీ  కారణంగానే బీజేపీ, బలపడుతోందని అన్నారు. 

అలాగే కాంగ్రెస్ మిత్ర పక్షం నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా కూడా., పంజాబ్ ముఖ్యమంత్రి మార్పు విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, వ్యవహరించిన తీరును తప్పు పట్టారు. కాంగ్రెస్ పార్టీ పాత పోకడలు మార్చుకోకపోతే, ఇంకా గట్టి మూల్యమే చెల్లించవలసి వస్తుందని అన్నారు. అంతే కాదు   పార్టీగా కాంగ్రెస్ నష్ట పోవడమే కాదు, దేశం కూడా మూల్యం చెల్లిచవలసి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీనతను ఆసరాగా చేసుకునే బీజేపీ హిందుత్వ అజెండాను ముందుకు తీసుకుపోతోందని, అందుకు కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించక తప్పదని ఒమర్ అబ్దుల్లా ఘాటైన విమర్శలు చేశారు.   

ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ నాయకత్వం మీద ఘాటైనా వ్యాఖ్యలు చేసింది. కొత్తగా తృణమూల్ తీర్దం పుచ్చుకున్న, బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో 2024 ఎన్నికల్లో ప్రధాన మంత్రి పదవికి పోటీ పడే అభ్యర్థుల్లో పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందున్నారని అన్నారు. అయన అంతటితో ఆగలేదు మమతా బెనర్జీ  ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విపక్షాలు ముఖ్య పాత్రను పోషించాలి అంటూ కాంగేస్స్ పార్టీ ఆ  పాత్రను పోషించడంలో విఫలమైందని అన్నారు. అలాగే,  పార్టీ  ప్రధాన మంత్రి పదవికి మమత ముందు వరుసలో ఉన్నారనే వాస్తవాన్ని ఎవరూ విస్మరించలేరు’ అంటూ సుప్రియో పరోక్షంగా రాహుల గాంధీ మోడీకి సమ ఉజ్జీ కాదని అన్నారు. ప్రధాని మోదీని ఎదుర్కోవడంలో, ఆయనకు ప్రత్యామ్నాయంగా నిలవడంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విఫలమయ్యారని సుప్రియో అన్నారు. సుప్రియో అనడమే కాదు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార పత్రిక, ‘జాగో బంగ్లా’లో అదే విషయంపై ప్రత్యేక వ్యాసమే రాశారు. 

ఇతర పార్టీలు, ఇతర పార్టీల నాయకులు మాత్రమే కాదు, సొంత పార్టీ నాయకులు కూడా అదే అంటున్నారు. సంవత్సరం క్రితమే పార్టీ సీనియర్ నాయకులు, ( జీ 23)  కూడా అదే అంటూ వస్తున్నారు. తాజాగా పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ అయితే, రాహుల్ గాంధీ అధికారికంగా పార్టీ బాధ్యతలు తీసుకోవాలని లేదంటే తప్పుకుని మరొకరికి అవకాశం ఇవాలని అన్నారు. అంటే,ఇటు సొంత పార్టీ నాయకులు,అటు మిత్ర పక్షాలు,రాహుల్ గాంధీని  ప్రతి బంధకం బావిస్తున్నాయా ... ఆనే సందేహం కలుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్బారు.