శ్రీవారి సేవలకు టీటీడీ శుభవార్త
posted on Sep 23, 2025 7:15PM

తిరుమల శ్రీవారి సేవలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శుభవార్త చెప్పారు. సేవలకు సేవా కాలం అనంతరం వారికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు. శ్రీవారి సేవకులతో ఆస్థాన మండపంలో బీఆర్ నాయుడు మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. తిరుమలలో భక్తులకు సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు భగవద్భాంధవులు అని అన్నారు. శ్రీవారి సేవకులంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ప్రతిసారి టీటీడీ సేవకుల గురించే ప్రస్తావిస్తుంటానని వెల్లడించారు.దేశంలోని ఎంతోమంది ప్రముఖులు శ్రీవారి సేవ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలకు విచ్చేసే భక్తుల్లోనే భగవంతుడు ఉన్నాడని అన్నారు. వారికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లే అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో టీటీడీ సేవను మరింత బలోపేతం చేస్తామని వ్యాఖ్యానించారు. శ్రీవారి సేవా విభాగం పదింతలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.