కేసీఆర్ భయానికి ఇదే నిదర్శనం.. ఖుష్బూ

తెలుగు సినిమాలలో నటించిన ఖుష్బు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయ నాయకురాలిగా ఆమె తెలుగువారికి కొత్తే. రాజకీయవేత్తగా మారిన ఖుష్బు బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో ఆమె బీజేపీకి కీలక నేత. హైదరాబాద్ లో జరగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆమె కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా తెలుగు వారితో తనకు ఉన్న అనుబంధం కారణంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అంతే కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా కొన్ని ఘాటు విమర్శలూ చేశారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా చేస్తున్న అతిని ఆమె కేసీఆర్ లోని భయానికి దర్పణం పడుతోందని పేర్కొన్నారు.

నగరంలో బీజేపీ ఫ్లెక్సీలకు చోటు దొరకనంతగా టీఆర్ఎస్ ప్రచార ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని ఆమె ఎత్తి చూపారు. మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడమే మోడీ అంటే, బీజేపీ అంటే కేసీఆర్ ఎంతగా భయపడుతున్నారో తెలియజేస్తోందని ఖుష్బూ అన్నారు. ఇక రాష్ట్రానికి వచ్చిన ప్రధానికి స్వాగతం పలికేందుకు కేసీఆర్ రాకపోవడం ఆయన ఆలోచనా ధోరణికి, లెక్కలేని తనానికీ, ఫెడరల్ విధానం పట్ల విముఖతకు నిదర్శనంగా ఖుష్బూ పేర్కొన్నారు.