హైదరాబాద్ లోని తమిళనాడు మాజీ సీఎం నివాసం సీజ్

posted on: Mar 31, 2026 9:33AM

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన హైదరాబాద్‌లోని నివాసాన్ని అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్‌ శ్రీనగర్ కాలనీలో  జయలలితకు చెందిన నివాసాన్ని జీహెచ్ఎంసీ  అధికారులు సీజ్ చేశారు. ఈ నివాసానికి సంబంధించి దీర్ఘకాలంగా ఇంటిపన్ను చెల్లించకపోవడంతో నిబంధనల మేరకు అధికారులు ఈ నివాసాన్ని సీజ్ చేశారు. మంగళవారం (మార్చి 31) ఉదయం ఇక్కడకు చేరుకున్న జీహెచ్ ఎంసీ అధికారులు సీజ్ ప్రక్రియను పూర్తి చేశారు. 

హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఈ నివాసానికి సంబంధించి  83 లక్షల రూపాయల మేర ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోవడం, ఎన్నిమార్లు నోటీసులు జారీ చేసినా స్పందన లేకపోవడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు. గతంలో జయలలిత హైదరాబాద్ సందర్శించిన సందర్భాలలో ఆమె ఇక్కడ బస చేసేవారు.  

సినిమా రంగంలో అగ్రతారగా వెలిగి, ఆ తర్వాత తమిళనాడు రాజకీయాలను శాసించిన  జయలలితకు దేశవ్యాప్తంగా అనేక చోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. అయితే ఆమె మరణానంతరం ఈ ఆస్తుల నిర్వహణ విషయంలో స్పష్టత లేకపోవడంతో పన్నుల చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రస్తుతం శ్రీనగర్ కాలనీలోని జయలలిత నివాసం ఎవరి పర్యవేక్షణలో ఉందన్న విషయంపై  అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ నివాసానికి చెందిన పన్ను బకాయిలను వారసులు లేదా ఈ ఆస్తిని పర్యవేక్షిస్తున్న బాధ్యులు చెల్లిస్తేనే ఈ సీజ్ తొలిగే అవకాశం ఉంది. ఒకవేళ బకాయిలు చెల్లించని పక్షంలో మున్సిపల్ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకునేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...