బెంగాలీ కవి సునీల్ గంగోపాధ్యాయ మృతి
posted on Oct 25, 2012 12:19PM
బెంగాలీ సాహిత్యానికి పెద్దదిక్కుగా ఉన్న కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు సునీల్ గంగోపాధ్యాయ గుండె పోటుతో కన్నుమూశారు. బెంగాలీ సాహిత్యంపై చెరగని ముద్రవేసిన ఆయన ఐదు తరాల బెంగాలీ రచయితలకు వారధిగా నిలిచారు. కవిత, కథ, నాటకం లాంటి వివిథ రకాల ప్రక్రియల్లో తనదైన ముద్రని చూపించారు. గంగోపాధ్యాయ రచనల్ని కథావస్తువులుగా తీసుకుని కొన్ని సినిమాలు కూడా తీశారు. 2008 నుంచి కేంద్ర సాహిత్య అకాడమీకి సునీల్.. అధ్యక్షుడిగా కొనసాగుతూవచ్చారు. తూర్పు బెంగాల్ లోని ఫరీదా పూర్ లో 1934 సెప్టెంబర్ ఏడో తేదీన సునీల్ జన్మించారు. కోల్ కతాలోని డమ్ డమ్ మోతీజీల్ కాలేజీ, సురేంద్రనాథ్ కాలేజీ, సిటీ కాలేజీల్లో విద్యాభ్యాసం చేశారు. కలకత్త విశ్వవిద్యాలయంలో బెంగాల్ సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. చాలా కొద్ది కాలంలోనే శక్తిమంతమైన కవిగా, రచయితగా, నవలాకారుడిగా, నాటకకర్తగా గుర్తింపు పొందారు. కవితా ప్రక్రియ అంటే సునీల్ గంగోపాధ్యాయకి ప్రాణం. క్రిత్తిబాస్ అనే పత్రికను స్థాపించి కొత్త రచయితల్ని బాగా ప్రోత్సహించారు సునీల్ గంగోపాధ్యాయ.
1985లో సెయ్ సమయ్ నవలకు సాహిత్య అకాడెమీ అవార్డ్ ని అందుకున్నారు.