ఆపరేషన్ సిందూర్ హీరోలకు వీర చక్ర పురస్కారాలు
posted on Oct 22, 2025 10:07AM

దేశ రక్షణలో విశిష్ఠ సేవలు అందించడంతో పాటు అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత సైనిక దళాల సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలను ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ సహా పలు కీలక ఆపరేషన్లలో పాల్గొన్న ఆర్మీ, వైమానిక దళాలకు చెందిన పలువురు అధికారులను ప్రతిష్ఠాత్మక వీర చక్ర పురస్కారంతో గౌరవించింది. ఈ మేరకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివిధ ఆపరేషన్లలో భాగంగా ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించిన 1988 మీడియం బ్యాటరీకి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ సుశీల్ బిస్త్కు వీర చక్ర లభించింది. అదే విధంగా అత్యంత రహస్యంగా, తక్కువ సమయంలోనే ప్రత్యేక పరికరాలను విమానాల ద్వారా సమర్థంగా తరలించి, సైనిక సామర్థ్యాన్ని చాటిన 302 మీడియం రెజిమెంట్కు చెందిన కల్నల్ కోశాంక్ లాంబాకు కూడా ఈ పురస్కారం వరించింది.
భారత వైమానిక దళం నుంచి పలువురు అధికారులు వీర చక్రకు ఎంపికయ్యారు. శత్రువుల గగనతలంలోకి చొచ్చుకు వెళ్లి నిర్దేశిత లక్ష్యాలను ఛేదించినందుకు ఫైటర్ పైలట్ గ్రూప్ కెప్టెన్ రంజీత్ సింగ్ సిద్ధూ, ఫార్వర్డ్ ఎయిర్బేస్లో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్) స్క్వాడ్రన్కు నాయకత్వం వహించిన గ్రూప్ కెప్టెన్ అనిమేశ్ పట్నీ, అలాగే అర్ధరాత్రి వేళ శత్రు భూభాగంలోకి ప్రవేశించి కోటలాంటి లక్ష్యాలను ధ్వంసం చేసిన స్క్వాడ్రన్ లీడర్ రిజ్వాన్ మాలిక్, సంక్లిష్టమైన వైమానిక దాడిలో అద్భుతమైన సమన్వయం ప్రదర్శించిన స్క్వాడ్రన్ లీడర్ సిద్ధాంత్ సింగ్లకు వీర చక్ర పురస్కారాలు ప్రకటించారు.
మొత్తంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 127 గ్యాలంట్రీ అవార్డులు, 40 విశిష్ట సేవా పురస్కారాలకు ఆమోదం తెలిపారు. వీటిలో 4 కీర్తి చక్రలు, 15 వీర చక్రలు, 16 శౌర్య చక్రలు ఉన్నాయి. దేశ భద్రత పట్ల సైనిక దళాల అంకితభావం, నాయకత్వ పటిమ, కార్యాచరణ నైపుణ్యాలకు ఈ పురస్కారాలు నిదర్శనమని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది.