ఈ తప్పుకి కారణమెవరు?.. ఆరేండ్ల చిన్నారి హత్యపై యువకుడి లేఖ వైరల్..
posted on Sep 20, 2021 3:40PM
హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన ఆరేండ్ల చిన్నారిపై హత్యాచారం కేసు తెలంగాణను షేక్ చేసింది. వారం రోజులైనా నిందితుడు దొరక్కపోవడంతో ప్రభుత్వం రోడ్డున పడింది. వేలాది మంది పోలీసులు దొరికినా నిందితుడు రాజు దొరకలేదు.. చివరికి ఆ మృగాడు రైలు కింద పడి సూసైడ్ చేసుకోవడంతో పోలీసులు ఊపీరీ పీల్చుకున్నారు. అయితే రాజు చావుతో ఈ సమస్యకి పరిష్కారం దొరికినట్టేనా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
నిందితుడు పెరిగిన నేపధ్యం, సింగరేణి కాలనీలో గంజాయి మత్తు, వంటి ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. ఇలాంటి సమస్యలకి శాశ్విత పరిష్కారం దొరకడం దాదాపు అసాధ్యమే. తాజాగా సింగరేణి చిన్నారి ఘటనపై ఓ యువకుడు ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది., అందరిని ఆలోచింప చేస్తోంది. ఆ యువకుడు రాసిన పోస్ట్ యధావిధిగా..
నా పేరు అజ్జు.. అజహరుద్దీన్. నేను జాబ్ చేసే ప్లేస్ కు హైదరాబాద్ లోని సింగరేణి కాలనీ అతి దగ్గరగా ఉంటుంది. అక్కడ నివసించే కుటుంబాలన్నీ పొట్టచేత పట్టుకుని వలస వచ్చినవే. బాధితురాలు కుటుంబం, నిందితుడు రాజు కుటుంబం కూడా అలా వచ్చినవే. ఇప్పుడు ఆ సింగరేణి కాలనీ గురించి కొన్ని వాస్తవాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను.
6 ఏళ్ల పసి బిడ్డతో ఎవరైనా లైగింకానందాన్ని పొందగలరా? లేదు. మరి ఆ సమయంలో రాజు అలా ఎందుకు ప్రవర్తించాడు? అతనిలో పైశాచికత్వం దానికి కారణం. మరి.. ఆ పైశాచికత్వానికి కారణం ఏమిటి? మందు, గంజాయి, వైట్నెర్ ఇలా ఒక్కటేమిటి? కావాల్సినన్ని మత్తు పదార్ధాలు. నిజానికి సింగరేణి కాలనీలో చాలా కుటుంబాల జీవనాధారం ఈ మత్తు పదార్ధాలను అమ్మడమే.
ఒకరోజు రాత్రి 12 గంటల ప్రాంతంలో నేను సింగరేణి కాలనీ నుండి వెళ్తుంటే.. ముగ్గురు మహిళలు రోడ్డుపై ఆపారు. ఆ పనికి రమ్మంటూ కవ్వించారు. ఇక్కడ చాలా కుటుంబాలకు వ్యభిచారం ఓ జీవనాధారం. నేను దానికి ఒప్పుకోకపోవడంతో బెదిరింపుకు పాల్పడ్డారు. జేబులో ఉన్న డబ్బు ఇవ్వమని రౌండప్ చేశారు. అప్పడే అటుగా పోలీసులు రావడంతో బయటపడ్డాను. “నీ ఇంటికి ఇది షార్ట్ కట్ రూట్ అయినా.. నువ్వు వేరే రూట్ చూసుకో ఈ ఏరియా అంత సేఫ్ కాదు”. అప్పుడు నాతో పోలీసులు అన్న మాట ఇది. నాకొక డౌట్.. సింగరేణి కాలనీ ఏమైనా అప్ఘనిస్తాన్ లో ఉందా?
మరోసారి బోనాల పండుగ. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ షాప్ లు బంద్. కానీ.., సింగరేణి కాలనీకి వెళ్తే, బ్లాక్ లో మాకు ఓ వైన్స్ షాప్ కి సరిపడ మందు కనిపించింది. అక్కడి చిన్న పిల్లలు సైతం ఈ బిజినెస్ లో కనిపిస్తారు. ఈ బిజినెస్ పోటా పోటిగా ..కస్టమర్ల కోసం వాళ్లలో వాళ్లే గొడవ పడేంతగా సాగుతోంది.
సింగరేణి కాలనీలో టీనేజ్ పిల్లలు సైతం పొగలు ఊదుకుంటూ కనిపిస్తారు. అవి సిగరెట్ పొగలు కావు. గంజాయితో నిండిన పొగలు. కాలేజ్ స్టూడెంట్స్ కు గంజాయి స్పాట్స్ ఇక్కడి పాన్ షాప్ లు! డబ్బులేని వాళ్లకు వైట్నర్ లు కూడా సరసమైన ధరలకే ఇక్కడ లభిస్తాయి.
చెత్తను సేకరిస్తూ కొన్ని కుటుంబాలు, దొరికిన పని చేస్తూ జీవితాన్ని వెళ్లేదీసే కొన్ని ఫ్యామిలీస్, వారి కష్టాన్ని క్యాష్ చేసుకునేందుకు కొన్ని అనైతిక బిజినెస్ లు ఇక్కడ ఎక్కువ. ఈ కాలనీలో ఎంత మంది ఉంటున్నారో తెలియదు, ఎవరెవరు ఉంటున్నారో తెలియదు. ఎవరొస్తున్నారో కూడా తెలియదు. ఆ కాలనీ అంతా అస్తవ్యస్త ఓ పద్మవ్యూహం. కానీ.., ఓట్ల లెక్కింపు మాత్రం ఇక్కడ క్రిస్టల్ క్లియర్!
రాజును ఇలా రాక్షసుడుగా మారడానికి ఈ దురలవాట్లు, వాటికి త్వరగా అలవాటు పడేలా చేసిన ఆ వాతావరణం కారణం. ఏది మంచి, ఏది చెడు అని తెల్సుకోలేని అతని అజ్ఞానం కారణం. సరిగ్గా అందని నిర్భంద విద్య, అవగాహన కల్పించలేని చట్టాలు. ఉపాధి కల్పించలేని విధానాలు, ఓటరుగా తప్ప రేపటి భవిష్యత్ గా చూడని రాజకీయాలు అందుకు కారణం.
రాజు ఆత్మహత్యతో నేరస్తుడు చచ్చాడు. మరో నేరం జరిగే వరకు ప్రజల ఆవేశాలు చల్లబడతాయి.! మళ్లీ రాజు లాంటి మరో ‘బూజు’ వచ్చాక.. నిందితుడిని ఎన్ కౌంటర్ చేయండి అంటూ మళ్లీ పాత నినాదాలే సరికొత్తగా వినిపిస్తాయి. కానీ.., సమస్య మూలలను మాత్రం మనం మార్చే ప్రయత్నం చేయడం లేదు. మనం అంటే మొత్తం వ్యవస్థ.
ఇది ఆ యువకుడు చేసిన పోస్ట్. ప్రతి అక్షరంలో నిజం ఉంది. ఒక్క సింగరేణి కాలనీ పరిస్థితి మాత్రమే కాదు.. మన దేశంలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ నుండే రాజు లాంటి మృగాలు తయారు అవుతున్నాయి. అవి మన బిడ్డల జీవితాలను చిదిమేస్తున్నాయి.మరి..ఈ తప్పుకి ఎవరిని నిందించాలి?