కేసీఆర్ కాళ్లు మొక్కిన కలెక్టర్! విపక్షాల ఫైర్..

తెలంగాణ ముఖ్యమంత్రి ప్రగతి భవన్ వీడారు. విపక్షాలు విమర్శలో, జనం ఆగ్రహం తెలిసొచ్చిందో తెలియదు కాని చాలా కాలం తర్వాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. తన సొంత గడ్డ సిద్దిపేట నుంచే జిల్లాల పర్యటన ప్రారంభించారు కేసీఆర్. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు పోలీస్ కమిషనరేట్, జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ షాకింగ్ ఘటన జరిగింది, 

జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత కలెక్టర్ ఛాంబర్‌లోకి వచ్చారు సీఎం. కలెక్టర్ కుర్చీలో జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని కూర్చో బెట్టారు. అయితే తన కుర్చీలో ఆసీనులైన కలెక్టర్ వెంటనే లేచి..  సీఎం కేసీఆర్ కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు. తన కుటుంబ సభ్యులను సీఎంకి పరిచయం చేశారు.

ఐఏఎస్ స్థాయిలో ఉన్న అధికారి సీఎం కాళ్లు మొక్కడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  కలెక్టర్ అయి ఉండి సీఎం కాళ్లు మొక్కడంపై పలువురు ఐఏఎస్ అధికారులు, పలువురు ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. గతంలోనూ నూతన జిల్లా ఏర్పాటు సమయంలోను సీఎం కాళ్లు మొక్కి విమర్శల పాలయ్యారు వెంకట్రామిరెడ్డి. తాజా మరోసారి అదే పని చేశారు.  సిద్దిపేట జిల్లా కలెక్టర్… ఓ అధికారియా… లేక రాజకీయ నాయకుడా.. అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇదే కలెక్టర్ ను గతంలో సీఎం కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే అని సంభోదించారు.

దుబ్బాక ఉప ఎన్నిక సమయంలోనూ దుబ్బాక టికెట్ జిల్లా కలెక్టర్‌కు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఆయన ఆ వార్తను ఖండించలేదు. కాగా ప్రస్తుతం కలెక్టర్ కార్యాలయ ఓపెనింగ్‌లో రాజకీయ నాయకునిలా సీఎం కాళ్లపై పడటంతో జిల్లా కలెక్టర్ రాజకీయాల్లోకి రావాలనుకొంటున్నాడా అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.