గుడిసెల నుంచి గౌరవప్రద జీవితం వైపు...పేదలకు ప్రభుత్వం అండ

posted on: May 24, 2026 1:04PM

 

పూరి గుడిసెలకు గుడ్‌బై... ఇళ్ల నిర్మాణంలో తెలంగాణ దూకుడు..

ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు... తెలంగాణ ప్రభుత్వ భారీ లక్ష్యం..

తెలంగాణలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ దశలో 2.5 లక్షల గృహాల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 వేల ఇళ్ల చొప్పున కేటాయించాలని నిర్ణయించింది. ఇందులో 1,500 ఇళ్లను కొత్త లబ్ధిదారులకు నిర్మించగా, మిగిలిన 500 ఇళ్లను గతంలో వివిధ గృహనిర్మాణ పథకాల కింద అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్ల పూర్తి కోసం వినియోగించనుంది.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌, వాకిటి శ్రీహరితో కలిసి గృహనిర్మాణ, సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించారు.

ప్రతి నియోజకవర్గంలో కేటాయించే 1,500 కొత్త ఇళ్లకు గతంలో అమలు చేసిన విధానంలోనే నిర్మాణ దశలను బట్టి దశలవారీగా రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది. ఇక అసంపూర్తిగా మిగిలిన ఇళ్లలో పునాదులు పూర్తై గోడలు, శ్లాబు పడని ఇళ్లకు రూ.3 లక్షలు, గోడలు పూర్తై శ్లాబు దశలో నిలిచిపోయిన ఇళ్లకు రూ.2 లక్షల చొప్పున సహాయం అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన గృహలక్ష్మి పథకం లబ్ధిదారులు కూడా ఈ నిర్ణయంతో లాభపడనున్నారు. 

అలాగే ఉమ్మడి రాష్ట్ర ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సిమెంట్‌, స్టీల్‌, నగదు రూపంలో రూ.25 వేల సాయం పొందిన వారిని కూడా రెండో విడత ఇందిరమ్మ పథకానికి అర్హులుగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వారికి ఇప్పటికే ఇచ్చిన రూ.25 వేలను మినహాయించి మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో గుర్తించిన సుమారు 14,800 పూరి గూడిసెల కుటుంబాలకు కూడా రెండో విడత ఇందిరమ్మ పథకం కింద ఇళ్లను మంజూరు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. “గుడిసెలు లేని తెలంగాణ” లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇక కోర్ అర్బన్ ఏరియా (క్యూర్‌) పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. 

గ్రేటర్ హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఎల్‌ఐజీ, ఎంఐజీ వర్గాల కోసం లక్ష ఫ్లాట్ల నిర్మాణం చేపట్టనుంది. క్యూర్‌ పరిధిలో 6 నుంచి 7 లక్షల దరఖాస్తులు రాగా, అందులో 18,500 మందికి మాత్రమే సొంత స్థలాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వారికి ఈ నెలాఖరులోగా రూ.5 లక్షల సాయం అందించనుంది.


ఎల్‌ఐజీ వర్గాలకు 400–420 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లు నిర్మించి ఇవ్వనుండగా, ప్రభుత్వం రూ.5 లక్షలతో పాటు అన్‌డివైడెడ్ ల్యాండ్‌ షేర్‌ను ఉచితంగా ఇవ్వనుంది. అదనంగా వచ్చే రూ.4–5 లక్షల వ్యయాన్ని లబ్ధిదారులే భరించాల్సి ఉంటుంది. జీవనోపాధి ఉన్న ప్రాంతాల్లోనే ఇళ్ల నిర్మాణం చేపడతామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

అలాగే క్యూర్‌ పరిధిలో నిర్మించే లక్ష ఇళ్లలో 30 శాతం ఇళ్లను ఎంఐజీ వర్గాలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంఐజీ లబ్ధిదారుల నుంచి వసూలు చేసే నిధులను ఎల్‌ఐజీ ఇళ్ల నిర్మాణానికి వినియోగించనున్నట్లు వెల్లడించింది.

ఇక తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.22,500 కోట్లతో మంజూరైన 4.5 లక్షల ఇళ్లలో పూర్తయిన లక్ష ఇళ్లకు జూన్‌ 1న గృహప్రవేశాలు నిర్వహించనున్నారు. అదే రోజు కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీల కోసం నిర్మించిన 28 ఇందిరమ్మ ఇళ్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రెండో విడత 2.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...