జ్యువెలరీ షాప్‌లో రౌడీషీటర్ వీరంగం

posted on: Jun 27, 2026 12:09PM

 

పీకలదాకా మద్యం సేవించారు... నేరుగా జ్యువెలరీ షోరూమ్‌లోకి దూసుకెళ్లారు... కత్తి చూపిస్తూ లక్ష రూపాయలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు... డబ్బులు ఇవ్వక పోతే చంపేస్తామని హెచ్చరించి అక్కడ నానా హంగామా సృష్టించారు. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ ఘటనతో షోరూం సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు.హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నంబర్–10లో ఉన్న శ్రీ సాయి జగదాంబ పెరల్స్ అండ్ జ్యువెలర్స్ షోరూమ్‌‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 

రౌడీషీటర్ ఆలీమ్ తన అనుచరుడు యూనస్‌తో  కలిసి పీకలదాకా మద్యం సేవించి షోరూమ్‌లోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్లిన వెంటనే మేనేజర్ పంకజ్ బండ్గర్‌ను కత్తితో బెదిరిస్తూ లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ప్రస్తుతం అంత డబ్బు లేదని మేనేజర్ చెప్పడంతో ఇద్దరూ మరింత ఆగ్రహానికి గురైననిందితులు షోరూంలోని సిబ్బందిని, మేనేజర్ ను చంపేస్తామంటూ రచ్చ రచ్చ సృష్టించి చివరకు "మళ్లీ వచ్చిన ప్పుడు డబ్బు రెడీగా ఉంచాలి... లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అంటూ బెదిరింపులకు గురి చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు..

ఈ ఘటనతో షోరూంలో ఉన్న సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతరం మేనేజర్ పంకజ్ బండ్గర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు, షోరూం సిబ్బందికి ప్రాణ హాని ఉందని, డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని నిందితులు బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకే తిక ఆధారాలు, ఇతర వివరాల ఆధారంగా నిందితులు ఆలీమ్, యూనస్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ వాణిజ్య ప్రాంతంలో జరిగిన ఈ ఘటన వ్యాపార వర్గాల్లో ఆందోళన కలిగించింది. వ్యాపారుల భద్రతకు ఎలాంటి భంగం కలిగినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...