జూన్ నెలలో రికార్డు స్థాయిలో శ్రీవారి లడ్డూల విక్రయం

posted on: Jul 3, 2026 6:43PM

 

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో టీటీడీ లడ్డూ ఉత్పత్తిని కూడా విస్తృతంగా పెంచి, ఎలాంటి కొరత లేకుండా ప్రసాదాలను అందిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 1,11,96,170 లడ్డూలు, మే నెలలో 1,21,35,528 లడ్డూలు, జూన్ నెలలో 1,26,81,805 లడ్డూలు విక్రయమయ్యాయి. గత మూడు నెలలతో పోలిస్తే ఈ జూన్ నెలలో లడ్డూల విక్రయాలు గణనీయంగా పెరిగాయి.

కాగా, 2024 జూన్ నెలలో 1,02,64,364 లడ్డూలు, 2025 జూన్ నెలలో 1,19,21,353 లడ్డూలు విక్రయాలు జరగగా, 2026 జూన్ నెలలో 1,26,81,805 లడ్డూలు విక్రయించడం విశేషం. అంటే గత ఏడాది జూన్‌తో పోలిస్తే 7,59,452 లడ్డూలు అధికంగా విక్రయమవ్వడంతో 6.37 శాతం వృద్ధి నమోదైంది. అలాగే 2024తో పోలిస్తే 24,17,441 లడ్డూలు అధికంగా విక్రయమవ్వగా 23.55 శాతం వృద్ధి నమోదైంది. శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు విచ్చేస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో లడ్డూ ప్రసాదాల తయారీ, పంపిణీలో టీటీడీ సమర్థవంతమైన ప్రణాళికతో వ్యవహరిస్తూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం సేవలందిస్తోంది.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...